– సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపునకు లోకేష్ చర్యలు
– మంత్రి చొరవ పట్ల స్థానికుల హర్షం
మంగళగిరి, మహానాడు: మంగళగిరి నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేందుకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సొంతంగా అయిదు గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలు చేయడంతో పాటు వాటిని వినియోగించి పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించేందుకు ఐదుగురు కార్మికులను నియమించారు. వీరికి అవసరమైన జీతభత్యాలను నారా లోకేష్ సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఒక్కో గ్రాస్ కటింగ్ మిషన్ కొనుగోలుకు రూ.18వేల వరకు ఖర్చు చేశారు. ఆదివారం ఉదయం నుంచే మంగళగిరి పట్టణంలోని పానకాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో యంత్రాల సాయంతో గడ్డిని, పిచ్చి మొక్కలను తొలగించారు. ఆయా పనులను టీడీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు. మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.