మూడు నెలల్లో నైనీ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం

–  సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి
-సింగరేణి  నైనీ ప్రాజెక్టుకు పూర్తి సహకారం
-త్వరలోనే అటవీ భూమి బదలాయింపునకు అన్ని చర్యలు

-సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ విజ్ఞప్తిపై ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
-ప్రదీప్ కుమార్ జెనా సానుకూల స్పందన
-ఒడిశా రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీసీసీఎఫ్తోనూ సీఎండీ భేటీ

సింగరేణి భవన్: సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే విధంగా, అలాగే నైనీ సమీపంలో నిర్మించతలపెట్టిన థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తింపు కోసం సంస్థ ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

ఇందుకోసం సోమవారం ఆయన ఒడిశాలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనాతో ప్రత్యేకంగా సమావేశమై నైనీ బ్లాక్ కు సంబంధించి అన్ని అనుమతులు లభించిన విషయాన్ని.. అలాగే రెండో దశ అటవీ అనుమతుల్లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా సింగరేణి చర్యలు తీసుకుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా వన్య ప్రాణి నిర్వహణ ప్రణాళికలో పొందుపరిచినట్లుగా రూ.39 కోట్లను కూడా డిపాజిట్ చేశామని.. దీంతో ఇప్పటి వరకు రూ.180 కోట్లను పూర్తిగా ప్రభుత్వానికి చెల్లించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రారంభం కోసం కావాల్సిన 783 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి బదలాయించాలని కోరారు. సింగరేణి ఆధ్వర్యంలో నైనీ ప్రాజెక్టుకు సమీపంలో 1600(2 x800) మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా మాట్లాడుతూ.. సింగరేణి నైనీ ప్రాజెక్టు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను పూర్తిగా అందజేస్తామని హామీ ఇచ్చారు. అటవీ భూమిని వీలైనంత త్వరగా అప్పగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

అనంతరం ఆయన ఒడిశా రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒడిశా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్టక్షర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఇడ్కో ) ఛైర్మన్ హేమంత్ శర్మ ను కలిశారు. సింగరేణి త్వరలోనే నైనీ నుంచి బొగ్గు ఉత్పత్తి చేపట్టనుందని.. అయితే ఈ బొగ్గును సింగరేణి థర్మల్ విద్యుత్ అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో నైనీ గనికి 50 కిలోమీటర్ల దూరంలోనే 1600 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు.. ఇందుకోసం సింగరేణి ఉన్నతాధికారుల బృందం గతంలో ఒడిశాలో పర్యటించి నాలుగు ప్రదేశాలను పరిశీలించిందని వివరించారు. 800 ఎకరాల స్థలం అవసరం ఉంటుందన్నారు. సంబంధిత భూములకు సంబంధించిన ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కావాలని కోరారు. దీనిపై స్పందించిన హేమంత్ శర్మ సింగరేణి పరిశీలించిన స్థలాలపై ఇడ్కో సీజీఎం(ల్యాండ్) సరోజ్ కుమార్ సేథీతో మాట్లాడారు. సింగరేణికి సహకారం అందించాలని సూచించారు.

అనంతరం ఒడిశాలో ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సుశాంత్ నందాను సింగరేణి సీఎండీ కలిశారు. అటవీ భూమిని బదలాయించాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.

అనంతరం సింగరేణి సీఎండీ మాట్లాడుతూ.. అటవీ భూమి బదలాయింపు జరిగితే మూడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందని పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ ప్లాంట్ ను ఒడిశాలో ఏర్పాటు చేస్తే సంస్థకు ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నైనీ జీఎం తుమ్మలపల్లి శ్రీనివాసరావు, జీఎం (ఎస్టేట్స్) బండి వెంకటయ్య, చీఫ్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్ విశ్వనాథరాజు, ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్.మజుందార్, ఎస్ఈ(మైనింగ్) ప్రవీణ్ కశ్యప్ తదితరులు సీఎండీ వెంట ఉన్నారు.