జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం
ప్రజలపై మోయలేని భారాలు
దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై వైసీపాది అవగాహనారాహిత్యం
– తెదేపా పోలిట్బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల
అమరావతి , మహానాడు : జగన్రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉంటుందని తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమంటూ వైసీపీ నేతలు అవగాహనారాహిత్యంతో విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ప్రజలపై మోయలేని భారాలు
అయిదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకత్వం వల్లనే ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై రూ.7 లక్షల మేర భారం విధించి ప్రజల రక్తాన్ని పీల్చారు. జగన్ ముఠా లక్షల కోట్లు స్వంత ఆదాయం పెంచుకున్నారు. రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలను కబ్జా చేశారు. ఇసుక.. ఖనిజ సంపద లూటీ ద్వారా రూ.19 వేల కోట్లు స్వాహా చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎటువంటి భారాలు లేకుండా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విషం చిమ్మేందుకు కుట్రలు చేస్తున్నారు.
జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం
2014-19 మధ్య జీయస్డిపి 13.5% కాగా, 2019-24 మధ్య అది 10.5%నికి పడిపోయింది. 2014-19తో పోలిస్తే మూలధన వ్యయం జగన్ పాలనలో 60% తగ్గించారు. చంద్రబాబు పాలనలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణతో పోలిస్తే ఏపీకి 3.66% అధికంగా వచ్చేది. జగన్ పాలనలో ఏపీ కంటే తెలంగాణాకు 31.65% పెరిగింది. ఇలా అన్నివిధాలా ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో వెనక్కు పోయింది.
నాడు శాసనసభకు కూడా వాస్తవాలు చెప్పకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిన విషయం వాస్తవం కాదా? బడ్జెట్లో లేని అప్పులు, పెండింగ్ బిల్లులు, కార్పొరేషన్ ద్వారా అప్పులు వంటి విషయాలను ప్రజలకు తెలియకుండా చేసింది వైసీపీ నేతలు కాదా? ఆర్థిక అరాచకత్వంతో వ్యవస్థలను విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అన్నివిధాలా వెనక్కు నెట్టారు. ఈ సమయంలో దూరదృష్టితో ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం అభివృద్ధిని అడ్డుకోవడమే.
ఇప్పటికే తేలిన లెక్కల ప్రకారం రూ.10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఇంకా తేలాల్సిన అప్పులు ఉన్నాయి. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి కూడా అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. 2018-19లో రూ.35,465 కోట్లు ద్రవ్యలోటు ఉండగా, 2022-23 నాటికి రూ.52,508 కోట్లకు చేర్చారు.
దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత
ప్రభుత్వ కార్యాలయాలు, భూములే కాకుండా రాష్ట్ర సచివాలయాలు సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన చరిత్ర వైసీపీ నేతలది. అడ్డగోలుగా అప్పులు తీసుకువచ్చి అయిదేళ్లలో ఒక్క రోజైనా ఒకటో తేదీ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు అందజేసిన పాపాన పోలేదు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగానికి ఎటువంటి చేయూత ఇవ్వకపోవడంతో దేశంలోనే అత్యధికంగా 24% నిరుద్యోగిత రాష్ట్రంలో నమోదు కావడానికి కారణం జగన్రెడ్డి కాదా? ఎఫ్ఆర్బియం నిబంధనలను సైతం ఉల్లంఘించి యధేచ్ఛగా అప్పులు తెచ్చారు.
జగన్ పాలనలో నాలుగుసార్లు భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచి, ఉచిత ఇసుకను రద్దు చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి కలను దూరం చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజల సొంత ఇంటి కలను తీర్చేందుకు రూ.4 లక్షలతో గృహ నిర్మాణానికి సాయం చేస్తోంది. ఇచ్చినమాట ప్రకారం 16,347 డీయస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచాం. పింఛన్ను రూ.4 వేలకు పెంచడంతోపాటు అన్న క్యాంటీన్లను, రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.