Mahanaadu-Logo-PNG-Large

జి.వి.ఆంజనేయులుకు అభినందనల వెల్లువ

నివాసానికి తరలివచ్చిన నేతలు, అభిమానులు
వినుకొండ పార్టీ కార్యాలయంలో సందడి

వినుకొండ: కూటమి ప్రభంజనంలో అపూర్వ విజయం అందుకున్న తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవీ ఆంజనేయులుకు అభిమాన గణం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం నాటి ఫలితాల్లో ప్రత్యర్థుల అంచనాలకు కూడా అందని రీతిలో 30,267 ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దాంతో జీవీ ఇంటికి, పార్టీ కార్యాలయానికి బుధవారం పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, శ్రేణులు తరలి వచ్చారు. జీవీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాంతో వినుకొండలోని జీవీ స్వగృహం, టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ చివరి వరకు విజయాన్ని అడ్డుకోవడానికి అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా, ఎమ్మెల్యే బొల్లా బెదిరింపులు, అకృత్యాలకు ఎదురు నిలిచి తిరుగులేని విజయం అందు కోవడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందన్నారు. తన నివాసానికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను జీవీ ఆంజనేయులు ఆప్యాయంగా పలకరించారు. కారుపై ఎక్కి అభివాదం చేశారు. క్లిష్ట సమయంలో జీవితంలో మరిచిపోలేని ఘన విజయాన్ని అందించిన వినుకొండ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. తన విజయానికి శ్రమించిన ప్రతి కార్యకర్తకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.