ఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ నిలిపేయాలి

-సింగరేణి తెలంగాణ కొంగు బంగారం,దీన్ని ప్రైవేటుపరం కానివ్వం
-పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలి
-ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి
-బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలి
– బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర

ఢిల్లీ: తమ బీఆర్ఎస్ నుంచి గెల్చిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని,అందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో పేర్కొని, దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి,సహచర ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డితో కలిసి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అని,తమ రాష్ట్రానికిదే గొప్ప ఆదాయవనరు అని,దీన్ని ప్రైవేటుపరం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.దీన్ని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలు,కుట్రలను తమ నాయకులు కేసీఆర్ గారు భగ్నం చేశారని,ఈ గనుల పరిరక్షణకు పోరాడామని,అవసరమయితే ఇక ముందు కూడా పోరాడుతామన్నారు.

గనుల మంత్రిగా ఉన్న తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి తగు చొరవ తీసుకుని బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు.బయ్యారం,పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బైలదిల్లలో సమృద్ధిగా ఉన్న ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉక్కు కర్మాగారం నెలకొల్పితే యువతకు ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతాయని,తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు.

ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి,బండి సంజయ్, రాంమోహన్ నాయుడు, చంద్రశేఖర రావులకు ఎంపీ వద్దిరాజు శుభాకాంక్షలు తెలిపారు