– బీసీ,ఇడబ్ల్యుఎస్ సంక్షేమ,హ్యండ్లూమ్స్& టెక్స్ టైల్స్ మంత్రి ఎస్.సవిత
అమరావతి: రాష్ట్రంలో అసంపూర్తిగా నున్న బీసీ భవనాలు, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ,ఇడబ్ల్యుఎస్ సంక్షేమ, హ్యండ్లూమ్స్& టెక్స్ టైల్స్ మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు.
వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టాల్సిన మరామ్మత్తులపై నివేదికను అందజేయాలన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ,ఇడబ్ల్యుఎస్ సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమావేశమై శాఖాపరంగా నిర్వహిస్తున్న పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు, శ్రీకాకుళం మరియు కర్నూలు జిల్లాల్లో బి.సి. భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
గుండుమల, గుదిబండ, గోనెబావి, రొద్దం, డోన్, బేతంచర్ల మరియు తొండూరు ప్రాంతాల్లో నిర్మాణంలో నున్న బి.సి. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను త్వరితగతిని పూర్తి చేసి విద్యార్థులకు సాద్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. బీసీ, ఇడబ్ల్యుఎస్ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయబడుచున్న పథకాలను మరింత సమర్థవంతంగా అమలు పర్చేందుకు టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాధులను స్వీకరించాలన్నారు.
మెగా డిఎస్సీలో పోటీ పడే అభ్యర్థులకు సమర్థవంతమైన శిక్షాణా కార్యక్రమాన్ని బి.సి.స్టడీ సర్కిళ్ల ద్వారా అందజేయాలని ఆదేశించారు. బి.సి. స్టడీ సర్కిళ్లలో శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు క్యాలెండర్ ను రూపొందించాలని ఆదేశించారు. బి.సి. కులవృత్తుల వారి పంపిణీకి ఉద్దేశింపబడిన పనిముట్లు, పరికరాలు ఇంకా గోధాముల్లో ఉన్నట్లైతే వాటిపై సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు. శాఖా పరంగా చేపట్టాల్సిన ప్రాధాన్యతా అంశాల అమలుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పర్చాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరామ్, డైరెక్టర్ కృష్ణమోహన్, బి.సి.ఫైనాన్సు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.