– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
– నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తాం: ఒడిశా సీఎం మొహన్ చరణ్ మంజీ
– వెంటనే చర్యలు చేపట్టండి అంటూ అధికారులకు ఒడిస్సా సీఎం ఆదేశాలు
– నైనీ బొగ్గు గనులను సందర్శించిన డిప్యూటీ సీఎం
– అభివృద్ధి పనుల ప్రారంభం, నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారంపై అధికారులకు సూచనలు
– స్థానిక ఎమ్మెల్యే, నిర్వాసితులతో డిప్యూటీ సీఎం సమావేశం
– తెలగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నైనీ బొగ్గు ఉత్పత్తి సాకారం
– పర్యటనలో పాల్గొన్న ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
భువనేశ్వర్: 2015లో సింగరేణి కేటాయించిన ఒరిస్సా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఒడిస్సా సీఎంను కోరగా.. ఆయన వెంటనే స్పందించారు. నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని ఒడిస్సా సీఎం భరోసా ఇవ్వడం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు వెను వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
నైని బ్లాక్ లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరెందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారుల బృందంతో కలిసి ఒడిస్సా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు.
2017 లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. నాడు అందచేసిన వినతి పత్రాల ను అందజేశారు. తాడిచర్ల బ్లాక్, నైని బ్లాక్ లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా గతంలోనే విజ్ఞప్తి చేసినట్టు వివరించారు.
నైనీ బ్లాకు లో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిస్సా సీఎంకు వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సన అంశం పెండింగ్లో ఉంది, ఈ సమస్య పరిష్కారం అయితే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైని బ్లాక్లో తవ్వకాలు చేపట్టడం మూలంగా ఒరిస్సా రాష్ట్ర యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో 600 కోట్ల వరకు ఒరిస్సా సర్కార్ కు ఆదాయం సమకూరుతుందని వివరించారు.
దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వ సంస్థ సింగరేణి మనుగడకు నైనీ బొగ్గు గనులు అత్యంత ఆవశ్యకమని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిస్సా సీఎంకు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విన్నపం తో ఒడిస్సా సీఎం వెంటనే స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి బృందానికి స్పష్టం చేశారు.
భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని స్థానికంగా ఉన్నత అధికారులకు ఒడిస్సా సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తిని వీలైనంత త్వరలోనే ప్రారంభించే అవకాశాలు నెలకొన్నాయి.
నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తికి ఆలస్యం కలిగిస్తున్న అంశాలపై ఒడిస్సా సీఎంతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ పనులు వెంటనే పూర్తయినట్లైతే మరో మూడు నెలల్లోపే సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తుందని, దీనికి పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనికి ఒడిశా ముఖ్యమంత్రి పూర్తి సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాల పై తక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖా ఓ.యస్.డి సురేందర్ రెడ్డి సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్, పా ఎన్ వి కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
								