Mahanaadu-Logo-PNG-Large

ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతితోనే ప్రజాస్వామ్యం

`ప్రలోభాలకు లొంగకుండా ప్రజల్లో చైతన్యం అవసరం
`పౌరసంస్థలు, మేధావులు బాధ్యత తీసుకోవాలి
`రాజకీయ పార్టీలు ఎన్నికల సంస్కరణలకు పూనుకోవాలి
`నెదర్లాండ్‌ ప్రొఫెసర్‌ వార్డ్‌ బైరన్‌ స్కాట్‌

గుంటూరు, మహానాడు : భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారానే భారతీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రముఖ రాజనీతి మానవీయ శాస్త్ర ప్రొఫెసర్‌ వార్డ్‌ బైరన్‌ స్కాట్‌ పేర్కొన్నారు. నెదర్లాండ్‌కు చెందిన ఆయన అంతర్జాతీ య ఖ్యాతిగాంచిన యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ భారత్‌, ఇండోనేషియాలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా గుంటూ రులో శనివారం రాత్రి జన చైతన్య వేదిక కార్యాలయాన్ని సందర్శించి పౌర సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఆయనతో పాటు కింగ్స్‌ కాలేజీ లండన్‌కు చెందిన ప్రొఫెసర్‌ విగ్నేష్‌ కార్తీక్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు చెందిన పూర్వ ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయ్య సూరి భారతీయ ఎన్నికల తీరుతెన్నులపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రొఫెస ర్‌ వార్డ్‌ బైరన్‌ స్కాట్‌ ప్రసంగిస్తూ ప్రపంచంలో ఎన్నికలలో డబ్బు పాత్ర బలంగా ఉన్న దేశాలు అభివృద్ధి చెందలేకపోయాయన్నారు. ఇదే పరిస్థితి భారతదేశంలో ఉత్పన్నమవు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు, మద్యం, కుల మతాల ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత బలమైన పౌర సంస్థలు, మేధావులు తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు తక్షణమే ఎన్నికల సంస్కరణలకు పూనుకో వాలని తెలిపారు.

రాజకీయ పార్టీలకు ప్రభుత్వ నిధులు కేటాయించాలి

ప్రొఫెసర్‌ విగ్నేష్‌ కార్తీక్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు ఎన్నికల నిధులు ప్రజల నుం చి సేకరించాలని, ప్రభుత్వాలు కూడా కొంతమేరకు నిధులు ఇవ్వడం ద్వారానే రాజకీ య కార్పొరేటీకరణను నివారించవచ్చని పేర్కొన్నారు. ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గటానికి ఓటర్లలో నైతిక బలం పెరగాలని అభిప్రాయపడ్డారు.

వ్యక్తి కేంద్రంగా రాజకీయాలతో విఘాతం

ప్రముఖ రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయ్య సూరి ప్రసంగిస్తూ భారతదేశంలో రాజకీయ పార్టీల మధ్య ఉన్న సైద్ధాంతిక వైవిధ్యాలు కనుమరుగయ్యాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారుతూ వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడప డం ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరుగుతున్న దేశాలలో భారతదేశం ముందుందని అన్నారు. కార్పొరేట్‌ రాజకీ యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల బరిలో కేవలం వెయ్యి కుటుంబాలు మాత్రమే పోటీ పడుతున్నాయని అన్నారు. సేవా తత్పరులు , మేధావులు, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న చైతన్యవంతులైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ పడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చాగోష్ఠిలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యూష సుబ్బారావు, మానవత సంస్థ చైర్మన్‌ పావులూరి రమేష్‌, రేట్‌ పేయిర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓ.నారాయణరెడ్డి, ఆమ్‌ ఆద్మీ నేత శివప్రసాద్‌, ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ నేత కోట రమేష్‌, తెలుగు భాషోద్యమ సంస్థ కన్వీనర్‌ వి.రంగారావు, రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చిల్లర శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.