పోలీసులకు తెలియకుండా ఆస్పత్రిపై గుంపు దాడి చేసిందా?

– సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ: అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ కోల్ కతా ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార, హత్య కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది.

‘ఈ ఘటన అత్యంత భయానకం. నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్టు తెలిసింది. కానీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైంది. రాత్రి 8.30 గంటలకు మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది?. ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటివరకు ఏం చేస్తున్నారు? మృతురాలి తల్లిదండ్రులను మూడు గంటల పాటు ఎందుకు వేచి చూసేలా చేశారు? ఆస్పత్రిలో అంతమంది ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. పోలీసులకు తెలియకుండా ఓ గుంపు ఆస్పత్రిపై దాడి చేసిందా? దుండుగుల గుంపు ఎలా దాడులకు పాల్పడింది? దుండగును కట్టడి చేయడంలో బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది’ అని సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది.