– వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఎస్పీ శ్రీనివాసరావు
పల్నాడు, మహానాడు: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం – 2024 సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గురువారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లో భాగంగా పోలీసులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ వైద్య శిబిరం కార్యక్రమాన్ని తలపెట్టడం సంతోషకరమన్నారు.
ఈ అవకాశాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో ముఖ్యంగా కంటికి, గుండెకు, ఎముకలకు సంబంధించిన వైద్య పరీక్షలు జరుపుతున్నట్టు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఈ దృష్ట్యా ఆరోగ్యంపై అశ్రద్ధ చేయొద్దన్నారు. మ్యాక్స్ విజన్ డాక్టర్ చెంచి రెడ్డి, రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అనిరుద్ ఫణి భార్గవ్ , శ్రీ దత్త సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ కాంత్ , పి.మహేష్ తదితరులు వైద్య సేవలు అందిస్తారన్నారు. పైన తెలిపిన హాస్పిటల్స్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ దగ్గర్లో ఉన్న పోలీస్ సిబ్బంది హాస్పిటల్స్ కు వెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
50 ఏళ్ళు దాటిన పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని గుండెకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించడానికి, ఉమెన్ సిబ్బందికి క్యాన్సర్ సంబంధిత పరీక్షలు స్త్రీ వైద్య నిపుణులతో చేయించుకొనే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం ఈ ఒక్క రోజుతో కాకుండా జిల్లాలోని పోలీసు సిబ్బందికి జిల్లా పోలీసు ఆఫీసులో పనిచేస్తున్న హోంగార్డ్స్ కు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ఈ వైద్య పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ జె. వి. సంతోష్(పరిపాలన ), ఏఆర్ డిఎస్పీ జి.మహాత్మా గాంధీ, వెల్ఫేర్ ఆర్ఐ యల్.గోపినాథ్, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజ్, ఎంటీ ఆర్ఐ కృష్ణ, అడ్మిన్ ఆర్ఐ ఎం. రాజా, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.