కొట్లాటలొద్దు..కలసి నడుద్దాం

– త్రీమెన్ కమిటీతో తొలి అడుగు
– వివాదం లేని అంశాలపైనే చర్చ
– మళ్లీ కలసి మాట్లాడదాం
– ఏపీ సీఎం బాబు-రేవంత్ భేటీ
– భేటీ మధ్యలోనే వివాదాస్పద అంశాలపై సోషల్‌మీడియాలో ప్రచారం
( మార్తి సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు-తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన భేటీలో తొలి అడుగు పడింది. విభజన సమస్యలతోపాటు, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఈ భేటీలో.. వివాదాలకు తావులేని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా.. రెండు రాష్ట్రాల మధ్య ఇకపై గొడవలు వద్దని, కలసి కూర్చుని పరిష్కరించుకుందామన్న ప్రతిపాదనకు ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించారు. చర్చల ద్వారానే ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు.

అందులో భాగంగా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో త్రీమెన్ కమిటీకి బీజం పడింది. అధికారులు-మంత్రులు-సీఎంల స్థాయిలో చర్చించుకోవలసిన అంశాలపై ఇకపై భేటీలు జరగనున్నాయి. రెండు దశలో పరిష్కారం కాని సమస్యలను, ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాలు.. రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా చూడాలని, ఎవరి సెంటిమెంట్లు గాయపరచకుండా, ఇరు రాష్ట్రాల ప్రజలు సమ్మతించేలా ఉండాలని నిర్ణయించారు. దానికి తగినట్లుగానే.. తొలి సమావేశంలో వివాదాస్పద అంశాలను, ఎవరూ ప్రస్తావనకు తీసుకురాకపోవడం విశేషం. అయితే రెండు రాష్ట్ర ప్రజలకు మహమ్మారిగా మారిన డ్రగ్స్-గంజాయి నియంత్రణపై కలసి సాగాలని నిర్ణయించారు. పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకూ కలసి పనిచేయాలని, ఆ మేరకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఒక సమన్వయ కమిటీ వేయాలని నిర్ణయించారు.

తొలుత చంద్రబాబునాయుడు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బిసి జనార్దన్‌రెడ్డికి.. తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. చంద్రబాబు-రేవంత్ ఇద్దరు పరస్పరం జ్ఞాపికలు అందించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి.. తెలంగాణ కవి కాళోజీ రాసిన నాగొడవ పుస్తకాన్ని చంద్రబాబుకు అందించారు. సుహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశం తర్వాత అంతా కలసి డిన్నర్ చేశారు.

చాలా ఏళ్ల తర్వాత తొలిసారి రెండు రాష్ట్రాల సీఎంల భేటీ జరగడంతో, ప్రజాభవన్‌కు మీడియా పోటెత్తింది. సాధారణ ప్రజలు కూడా అక్కడికి చేరటం కనిపించింది. భేటీ తర్వాత బయటకు వచ్చిన భట్టి, శ్రీధర్‌బాబు, పొన్నం, ఏపీ మంత్రులు అనగాని, జనార్దన్‌రెడ్డి, దుర్గేష్ సమావేశ వివరాలు వెల్లడించారు.

సోషల్‌మీడియాలో పుకార్ల షికార్లు..
ఇదిలాఉండగా.. సమావేశంలో తమకు ఏడు మండలాలలోని 7 గ్రామాలు తిరిగి ఇచ్చేయాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, ఆ మేరకు చంద్రబాబునాయుడు ఢిల్లీకి లేఖ రాసేందుకు అంగీకరించారంటూ తెలంగాణ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. హైదరాబాద్ లోని స్థిరాస్తులను ఏపీకి ఇచ్చేది లేదని, కావాలంటే ఢిల్లీలో ఏపీభవన్ మాదిరిగా నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే కొంత భూమి ఇస్తామని రేవంత్ చెప్పినట్లు ప్రచారం జరిగింది.

తమకు రావలసిన 24 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఏపీ సీఎం కోరగా, అందుకు రేవంత్ తిరస్కరించినట్లు.. భేటీ మధ్యలోనే సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఏపీ-తెలంగాణ మంత్రుల ఉమ్మడి విలేకరుల సమావేశంలో, అలాంటి ప్రస్తావనే లేకపోవడం బట్టి.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారును ఇరుకున పెట్టేందుకే, ఈ ప్రచారాన్ని విస్తృతం చేసినట్లు స్పష్టమయింది.