Mahanaadu-Logo-PNG-Large

డీజీపీ, సీఎస్‌లపై ఈసీ ఆగ్రహం

-అణచివేతలో విఫలమయ్యారని వ్యాఖ్య
-స్వయంగా హాజరుకావాలని ఆదేశం
-ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోనే ఉంది

ఢిల్లీ: పోలింగ్ అనంతరం ఏపీలో చెలరేగిన హింసను అణచివేయడంలో డీజీపీ, సీఎస్ విఫలమయ్యారని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. దీనిపై గురువారంలోగా స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ సమన్లు పంపింది. పల్నాడు జిల్లా, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులుచేసి గాయపరుస్తున్న వైనాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. అల్లర్లను అణచివేయటంలో డీజీపీ,సీఎస్ విఫలమయ్యారని అభిప్రాయపడింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హాజరవ్వాలని కోరింది.

పోలింగ్ అనంతరం హింసను నియంత్రించడంలో విఫలమవడానికి కారణాలు, దాడులను ముందుగా ఊహించకపోవడానికి కారకులు ఎవరనేది వివరించాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది వివరించాలని కోరింది.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోనే ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఎన్నికల సంఘం ఆదేశించింది.