చెంచులు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

– వైద్యా, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులు బలోపేతం
– అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులు, గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైద్యా, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులను బలోపేతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ఐటీడీఏ పరిధి లో నివసించే చెంచులకు, గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై హైదరాబాదులోని దామోదరం సంజీవయ్య భవన్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, మున్ననూరు లతో పాటు ఇతర జిల్లాలలో ఉన్న గిరిజనులకు, చెంచులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమీక్ష లో దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులకు దిశ నిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి చెంచు పెంట, గిరిజన గూడెంలో నివసించే ప్రతి వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా కార్యాచరణను రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు, చెంచులకు మెరుగైన వైద్యం అందించేందుకు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సమీక్షలో ఐటీడీఏ పరిధిలో వైద్య సేవల బలోపేతం పై అధికారులతో చర్చించారు. పలు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. భౌగోళికంగా ఐటీడీఏ పరిధిలో అత్యవసర పరిస్థితుల్లో అరగంట లోపే వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులకు చేరుకునేలా కార్యాచరణను రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు భౌగోళికంగా నెట్వర్క్ కలిగి ఉండేలా అవసరమైనా చోటా కొత్తగా ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పరిధిలోని ఆసుపత్రులలో సిబ్బంది డాక్టర్లు మందులు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా వర్షాకాలం లో ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ (ఈ డి డి) కంటే వారం ముందు గర్భిణులను ఆసుపత్రికి తరలించి వారిని బర్త్ వెయిటింగ్ రూమ్ లలో ఉంచేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాలలో స్థానిక గిరిజన భాష తెలిసిన సిబ్బందిని నియమించాలన్నారు. తద్వారా వారి సమస్యలను విని పరిష్కరించేందుకు దోహదపడుతుందన్నారు. అటవీ ప్రాంతంలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు బైక్ అంబులెన్స్ ను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఐటీడీఏ ప్రాంతాలలో సీజనల్ వ్యాధుల నివారణ పై మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి గిరిజన వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం సీజన్ వ్యాధులు ముందస్తు తీసుకున్న జాగ్రత్తల వల్ల తగ్గుముఖం పట్టాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చేపడుతున్న వైద్య సేవల పట్ల ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న చెంచులు, గిరిజనులకు అవగాహన కలిగేలా ఐటీడీఏ అధికారులు కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఐటీడీఏ పరిధిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నా వైద్య సేవల బలోపేతం పై హైదరాబాదులోని దామోదర సంజీవయ్య భవన్ లోని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భవనం లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష లో గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, హెల్త్ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఫ్యామిలీ హెల్త్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎం.డి హేమంత్ వాసుదేవ్ రావు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ రవీంద్రా నాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్‌ అజయ్ కుమార్, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.