-కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాక
-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, ట్యాంక్బండ్పై ఏర్పాట్లు పూర్తి
-గన్పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న నేతలు
-వేదికపై తెలంగాణ గీతం ఆవిష్కరణ..అనంతరం సన్మాన కార్యక్రమాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 9.30 నిమిషాలకు గన్ పార్క్లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్రెడ్డి అమరులైన వారికి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉండనుంది. ఇక వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధికా రిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత సీఎం రేవంత్రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటిం జెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం కార్యక్రమం ఉండనుంది. ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం అవుతాయి. తెలంగాణకు సంబంధిం చిన హస్త కళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
జాతీయ జెండాలతో ఫ్లాగ్ వాక్
స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంత సేపు 13 నిమిషాల 30 సెకండ్ల నిడివి ఉన్న జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8 గంటల 50 నిమిషాలకు 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశం లో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.