వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ

* రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా పంపిణీ
* రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి: వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 25 కిలోలు బియ్యంతోపాటుగా లీటరు పామాయిల్, కేజీ పంచదార, కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లి పాయలు, 2 కేజీలు బంగాళా దుంపలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ-పోస్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. 2 లక్షల మందికి సరుకులు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. రేషన్ కార్డులు లేనివారికి ఆధార్ కార్డులు ద్వారాగానీ తంబ్ ఇంప్రెషన్ ద్వారాగానీ పంపిణీ చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. గ్యాస్ కంపెనీలు కూడా సేవలందించేందుకు ముందుకు వచ్చాయన్నారు. ముంపు ప్రాంతాల్లో 12 సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నేటి నుంచి సబ్సిడీ ధరలతో కూరగాయలు విక్రయాలు మొదలయ్యాయి అన్నారు. విజయవాడలో వచ్చిన ఇటువంటి విపత్తు ఎప్పుడూ చూడలేదనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సహాయక చర్యలు పకడ్బందీగా జరుగుతున్నాయని తెలిపారు.