-ఐదేళ్లలో వారి సమస్యలు విన్న పాపాన పోలేదు
-కూటమి రాగానే వారికి న్యాయం చేస్తాం
-మే డే వేడుకల్లో వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జగన్రెడ్డి ఐదేళ్ల పాలనలో కార్మికలోకం పొట్టకొట్టారని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఒకట్రెండు హామీలపై కంటితుడుపు చర్యలు తప్ప గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ కార్మిక నాయకులను పిలిచి వారి కష్టనష్టాలు విన్న పాపాన కూడా పోలేదని దుయ్యబట్టారు. బుధవారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద మే డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు.
జగన్ ఐదేళ్లలో ఒక్కసారే వేతనాలు పెంచారన్నారు. కొన్ని శాఖల్లో ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి కూడా జీతాలు వేయలేని దుస్థితి ఉందన్నారు. ఒప్పంద పొరుగుసేవల సిబ్బందిని పథకాలకు అనర్హులను చేసి అన్యాయం చేశారన్నారు. కూటమి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తమ ప్రభుత్వం రాగానే వారికి పథకాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. కార్మికులకు ఇస్తున్న రూ.15 వేలు కుటుంబ ఖర్చులకే సరిపోవని ఇక పిల్లలనెలా చదివిస్తారని వాపోయారు. అందుకే జీతాలు పెంచే బాధ్యత కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాద బీమా కింద కార్మికులకు రూ.10 లక్షల ఇవ్వాలని వారి తరఫున చంద్రబాబును కోరతానని మాట ఇచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తామన్నారు. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛన్ వచ్చేలా చూస్తామన్నారు. కొవిడ్ సమయంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన తీరు మరవలేనిదని అన్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో రోగులు, వారి తరఫున వచ్చే కుటుంబసభ్యులకు శివశక్తి ఫౌండేషన్ తరఫున భోజనాలు పెడుతుంటే వాటిని పంచకుండా తీసుకెళ్లి పోలీస్స్టేషన్లో పెట్టించిన దుర్మార్గుడు బొల్లా అన్నారు. ఉచితమందుల పంపిణీ కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేని మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ వర్కర్స్కు కాలనీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు.