2036 ఒలింపిక్స్ కు సిద్దపడండి

-ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ చేయ‌బోతున్నాం
-52వ హైద‌రాబాద్ రీజ‌న్ ఆర్చ‌రీ స్పోర్ట్స్ మీట్
-ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, మహానాడు:విద్యార్ధులంద‌రూ క్రీడ‌ల్లో రాణించాలి..  భ‌విష్య‌త్తులో ఎడ్యుకేష‌న్ తో పాటు, స్పోర్ట్స్‌  కి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వ సాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బిడ్ చేయ‌బోతున్నాం. ఆ స‌మాయానికి ఒలింపిక్ లో ఆడేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సాంధించి సిద్ధంగా ఉండాలని ఎంపీ  కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు.

స‌త్యనారాయ‌ణ పురంలోని కేంద్రీయ విద్యాల‌యంలో గురువారం జ‌రిగిన‌  52వ హైద‌రాబాద్ రీజ‌న్ ఆర్చ‌రీ స్పోర్ట్స్ మీట్ కార్య‌క్ర‌మానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ కు స్కౌట్ అండ్ గైడ్స్ క‌ల‌ర్ పార్టీ తో విద్యార్థులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం డి.ఆర్.ఎమ్., వి.ఎమ్.సి చైర్మ‌న్ న‌రేంద్ర ఎ పాటిల్ తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఆ త‌ర్వాత కేంద్రీయ విద్యాల‌య రీజ‌న్  స్పోర్ట్స్  ప్లాగ్ ఆవిష్క‌రించి… బెలూన్లు గాల్లోకి వ‌దిలిపెట్ట‌డంతోపాటు.. శాంతిక‌పోతాల‌ను గాలిల్లోకి ఎగ‌ర‌వేశారు. 52వ హైద‌రాబాద్ రీజ‌న్ ఆర్చ‌రీ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనే క్రీడాకారులు ప్ర‌తిజ్ఞ చేయ‌గా, ఎంపి కేశినేని శివ‌నాథ్ అధికారికంగా ఈ క్రీడ‌లు ప్రారంభ‌మైన‌ట్లు ప్ర‌క‌టించారు. మైదానంలో ఆర్చ‌రీ చేత‌ప‌ట్టి  ల‌క్ష్యాన్ని చేధించారు.

ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ… మొద‌టిసారిగా కేంద్రీయ విద్యాల‌యానికి రావ‌టం ఎంతో సంతోషంగా ఉందన్నారు.  ఒలింపిక్ గేమ్స్ జ‌రిగే స‌మ‌యానికి ఇన్ ఫ్రాస్ట‌క్చ‌ర్ తో పాటు క్రీడాకారులు కూడా ఎక్కువ మంది సిద్దంగా ఉండాల‌న్నారు. అందుకోసం ఇప్ప‌టి నుంచే న‌చ్చిన క్రీడ‌ల్లో ప్రావీణ్యం సాధించాల‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేష‌న‌ల్ గేమ్ ఈవెంట్స్ జ‌రిపించి క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించాల‌నుకుంటున్నారని తెలియజేశారు.

అలాగే  ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ద్వారా మంగ‌ళ‌గిరి స్టేడియం, విజ‌య‌వాడ స్టేడియంలో అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వ‌హించే విధంగా స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరామన్నారు. రాబోయే ఐదు సంవ‌త్స‌రాల్లో క్రీడకారుల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో  డి.ఆర్.ఎమ్. , కెవి స్కూల్ విద్యాల‌య క‌మిటీ చైర్మ‌న్ న‌రేంద్ర ఎ పాటిల్, ప్రిన్సిపాల్ ఆదిశేషు శ‌ర్మ‌, వైస్ ప్రిన్సిపాల్ ఎమ్.వి.రావు, రీజ‌న‌ల్ టోర్న‌మెంట్ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ఏడుకొండ‌లు పాల్గొన్నారు.