జీవీ కుటుంబం సేవకు అంకితం

– ఎమ్మెల్యే జీవీ భార్య లీలావతి

నరసరావుపేట, మహానాడు: మా కుటుంబం ప్రజా సేవకు అంకితమని, శివశక్తి ఫౌండేషన్ ద్వారా మా పిల్లల తరం కూడా ప్రజలకు సేవలు అందిస్తారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భార్య, శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి తెలిపారు. స్థానిక నరసరావుపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్ లో శనివారం శివశక్తి ఫౌండేషన్, శంకర కంటి నేత్రాలయం సహకారంతో శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్ళజోళ్ళు, మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టగా, ముఖ్యఅతిథిగా లీలావతి పాల్గొని కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా 20 ఏళ్లుగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, 40 వేలకు పైగా కంటి శుక్ల ఆపరేషన్ చేయించి వృద్ధులకు కంటి చూపు ఇచ్చినట్టు తెలిపారు. అవ్వ తాతలకు కంటి ఆపరేషన్ చేయించి కంటి చూపుని ప్రసాదించే మహాభాగ్యాన్ని దేవుడు మాకు ప్రసాదించటం మా భాగ్యమన్నారు.

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ సేవనందించడం గొప్ప వరంగా భావిస్తున్నాని అన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది ప్రజలకు కళ్ళజోళ్ళు అందించినట్టు తెలిపారు. నేడు 900 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయించుకున్న అవ్వతాతలకు కళ్ళజోళ్ళు, మందులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆమె కోరారు. కార్యక్రమంలో శంకర కంటి నేత్రాలయం వైద్యులు డాక్టర్ రుతుజ, డాక్టర్ దీక్ష గుప్తా, డాక్టర్ బిపిన్ రాహుల్, డాక్టర్ రితిక, సిబ్బంది, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవీ రమణ రావు, టీడీపీ నాయకులు పటాన్ ఆయుబ్ ఖాన్, పి.సురేష్ బాబు సౌదాగర్ జానీ భాష, పువ్వాడ కృష్ణ, గంధం సుబ్బారావు, సాహేబా, ఇంకా శివశక్తి ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.