పిన్నెల్లి వీడియో ఎలా వచ్చిందో చెప్పాలి

ఎన్నికల కమిషన్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోంది
మాచర్లలో రిగ్గింగ్‌కు ఎస్పీ సహకరించాడు
నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌

తాడేపల్లి, మహానాడు : వైసీపీ కేంద్ర కార్యాలయంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమా ర్‌ యాదవ్‌ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు సత్యహరిచంద్రులన్నట్లుగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందన్నారు. మాచర్లలో పలు ప్రాంతాలలో రిగ్గింగ్‌ జరుగుతుందని ఎస్పీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదని, ఎస్పీ రిగ్గింగ్‌కు సహకరించాడని ఆరోపించారు. అందువల్లే పిన్నెల్లి వెళ్లి అడ్డుకు న్నారన్నారు. ఫోన్‌ రికార్డ్‌ చూసుకోవాలని కృష్ణదేవరాయలు అంటున్నాడని, వాట్సాప్‌ కాల్‌ మాట్లాడితే రికార్డు ఉండదని తెలుసన్నారు. పోలింగ్‌ డే రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసమైతే పిన్నెల్లి ఒక్క వీడియో ఎలా బయటకు వచ్చిందో ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలి. అందుకు సహకరించిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. టీడీపీ రిగ్గింగ్‌ చేసిన ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్‌, చింతపల్లిలో నామమాత్రంగా పోలీసుల ను పెట్టారు. అక్కడి బూత్‌ల వీడియో ఫుటేజ్‌ బయటపెట్టాలని కోరారు.