దొంగ ఓట్లు, బూత్లలో ఏజెంట్లను బెదిరిస్తే సహించం
పులివెందులలో ఓటుకు రూ.2 వేలు ఇచ్చే దీనస్థితికి వచ్చారు
నైతికంగా విజయం మాదే..ప్రజల్లో వ్యతిరేకత స్పష్టమవుతోంది
టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి వ్యాఖ్యలు
పులివెందుల, మహానాడు : దొంగ ఓట్లు వేయించడం, ఏజెంట్లను బెదిరించడం చేసి అవమానిస్తే సహించేది లేదని, చావడానికైనా చంపడానికైనా సిద్ధమని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి వ్యాఖ్యలు చేశారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ ఈ రోజు పులివెందులలో ఓటుకు రూ.2000 పంచే దీన స్థితికి వచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వాళ్ల ఓటమిని అంగీకరించినట్లే కదా అని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వలేదని ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పమనండి. మీ కుటుం బానికి మంచి జరిగితే నాకు ఓటు వేయండని జగన్ అంటున్నారు.. నేను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మంచి జరగడమంటే కరెంట్ బిల్లు పెరగడమా? రైతులకు ఇన్సూరెన్స్, డ్రిప్ పరికరాలు పంపిణీ చేయకపోవడమా? దాదాపు 1400 మంది జగన్ రెడ్డి మందుతాగి చనిపోవడం నువ్వు చేసిన మంచా? నాసిరకం మద్యం అధిక రేట్లకు అమ్మడమా? ఒక్క ఇండస్ట్రీ తేకుండా ఇక్కడ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడమా? అని ప్రశ్నించారు.
చిన్న అవమానం జరిగినా సహించం
దొంగ ఓట్లు వేయడం, బూత్ క్యాప్చర్ చేయడం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మా ఏజెంట్లకు ఏ చిన్న అవమానం జరిగినా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అలా కాదంటే నేను కూడా ఫ్యాక్షన్ కుటుంబమే. చావడానికైనా చంపడానికైనా సిద్ధం. దొంగ ఓట్లను వేస్తే పోలీసులకు పట్టిస్తాం. దీంతో జీవితంలో అన్నీ కోల్పోతారు. ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లను వేసుకోనివ్వండి. ప్రతిసారి జగన్ ఇది పేదవాడికి, పెత్తందారుకు పోటీ అంటున్నారు. అదే కరెక్ట్ అయితే పేదవాడిని నేను..రూ.750 కోట్లు చూపించుకున్న వ్యక్తి పెత్తందారి. అందుకే పులివెందుల నియోజకవర్గం ప్రజలను కోరు తున్నా పెదవాడిని అయిన తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నా. ఇన్నాళ్లు వైఎస్ కుటుంబానికి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి నాకు ఒక్క అవకాశం ఇస్తే ఏమి అభివృద్ధి చేస్తానో చూడండి. దయచేసి ఓటు వేసి గెలిపించాలని కోరారు.