బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే

-ఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారు
-రామాయణ్ సర్క్యూట్ కింద కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధి
-కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తి
-అధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిది
-కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా
-కరీంనగర్ మీడియాతో ఇష్టాగోష్టిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్: ఇతర పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశాల్లేవని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ కింద అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని చెప్పారు. కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సాధ్యాసాధ్యాలపై రూ.20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తయ్యాయన్నారు.

కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. అందులోని ముఖ్యాంశాలు.

విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై
గత కేసీఆర్ ప్రభుత్వం విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా రాజకీయ లబ్ది కోసం మరింత జఠిలం చేసి సమస్యను నాన్చుతూ వచ్చారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారు. చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశముంది. ఇప్పటికే కేసీఆర్ గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా? అని ప్రయత్నిస్తున్నారు. ఆ అవకాశం ఇవ్వొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నా. సీఎం లు చర్చించుకున్న విషయాలు మా దృష్టికి రావాలి కదా. రెండు రాష్ట్రాలు సానుకూలంగా ఉండడం మంచిది

ఈడీ కేసులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై..
ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధమే లేదు. నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈడీ కేసులున్న వాళ్లు, ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీ లోకి వచ్చే అవకాశాలు లేవు. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మాదిరిగా రాజీనామా చేయకుండా బీజేపీలోకి వచ్చే అవకాశమే లేదు.

బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదు? కాంగ్రెస్ పాలన నిజంగా బాగుంటే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలి. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే కచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తుంది.

అధ్యక్ష మార్పుపై..
స్టేట్ ప్రెసిడెంట్ మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. కొత్త నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులుంటాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అధ్యక్షుడిని చేయాలనే దానిపై అన్నీ ఆలోచించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.

రామాయణ్ సర్క్యూట్, కరీంనగర్హసన్ పర్తి రైల్వే లేన్ పై..
రామాయణ సర్క్యూట్ కింద ఇల్లంతకుంట ,కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అందుకోసం నేను తప్పకుండా క్రుషి చేస్తా. ఎములాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతాం.. ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించారు. కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు.
కరీంనగర్ -హాసన్ పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగింది. రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణంపై నిర్ణయం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించలేదు.
రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన విజ్ఝప్తుల మేరకే కేంద్రం గడువు పొడిగించింది. గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా.