అర్చకులకు చెల్లించే కనీస వేతనం పెంపు

– సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం
– దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెల్లడి

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో రూ. 50 వేలు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు చెల్లించే కనీస వేతనం రూ.15,000 లకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపువలన లబ్ధిపొందే అర్చకులు 1,683 మంది వుంటారన్నారు. కనీస వేతనం నెలకు రూ.15,000 కంటే తక్కువ పొందుతున్న అర్చకులకు కొత్త వేతనం కింద రూ. 15,000 చెల్లిస్తే దేవాదాయ శాఖకు రు.10 కోట్ల వరకు అదనపు వ్యయం అవుతుందని, మొత్తం లబ్దిపొందే అర్చకుల సంఖ్య 3,203 అని మంత్రి తెలిపారు.

ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు, ఇతర వర్గాలకు, అర్చకులకు, వేద పండితులకు, వేదాధ్యయన విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగ భృతితో సహా ఎన్నికల ప్రణాళికలోని అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక శాఖ దేవదాయశాఖ మాత్రమేనని దేవదాయశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేవాలయాలకు సంబంధించి, అర్చకులకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను తమ శాఖ అమలు చేయడంలో ముఖ్యమంత్రి సహకారం మరువలేనిదని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు.