ఆర్టీసీ కార్మికులను నమ్మించి మోసం చేసిన జగన్ రెడ్డి: ప్రత్తిపాటి

ప్రత్తిపాటిని సత్కరించిన చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఉద్యోగ సంఘాలు

చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్థాయిలో నమ్మించి మోసం చేసిన వ్యక్తి మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అంతకుముందు వరకు ప్రగతిరథ చక్రాలుగా ఉన్న ఆర్టీసీ జగన్ దెబ్బతో రోడ్డున పడే దుస్థితి దాపురించిందని, కార్మికుల సంక్షేమాన్ని పూర్తి విస్మరించారన్నారు.  విలీనం పేరిట కూడా ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలను కాలరాసి వారు కోలుకోలేని విధంగా దెబ్బ తీసిన దుర్మార్గుడు జగ న్అని మండిపడ్డారు.

చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఉద్యోగ సంఘాలు బుధవారం ప్రత్తిపాటి పుల్లారావును ఘనంగా సన్మానించారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సత్వరమే స్పందించారని ఆయనకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. భారీ గజమాలతో పాటు శాలువతో ప్రత్తిపాటిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి ఆర్టీసీకి నూతన జవసత్వాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందన్నారు. కొత్తబస్సులు, సర్వీసుల పెంపు, కార్మికుల ప్రయోజ నాల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నారని తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీకి మరింత ఆదరణ, ఆదాయం రెండు పెరుగుతాయన్నారు. 2019 ఎన్నికల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ పేరుకి చేసినా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని ప్రయోజనాలు కల్పించలేదు సరికదా ఆర్టీసీలో ఉన్నప్పుడు దక్కిన అనేక సదుపాయాలనూ కోసేశారు, బకాయిలనూ చెల్లించలేదన్నా రు. విలీనం జరిగి ఏళ్లు గడుస్తున్నా వారికి ఏ పింఛను ఇస్తారో చెప్పలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ సమస్యలన్నీ పరిష్కరించాల్సి ఉందన్నారు.