ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో ప్రతి బాధితుడికి న్యాయం జరగాలి

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి

చిలకలూరిపేట, మహానాడు: ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో నష్టపోయిన ప్రతిఒక్క బాధితుడికి న్యాయం జరగాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. మాజీ మేనేజర్, గోల్డ్ అప్రైజర్ కలిసి కోట్లాది రూపాయలకు మోసం చేస్తుంటే బ్యాంకు యంత్రాంగం కళ్లు మూసుకుందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట చిలకలూరిపేట అనుకుంటే నరసరావుపేటలోనూ ఇదే తరహా మోసం వెలుగుచూడడం, అదే మేనేజర్ విజయవాడలోనూ పనిచేయడంతో అక్కడ ఇంకా ఏం చేసి ఉంటారనే అనుమానలు కలుగుతున్నాయన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇంటిదొంగలే కోట్లు కొల్లగొట్టిన ఈ కేసులో సీబీఐ విచారణ కూడా జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులో మాయం అయిన బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి ప్రతి పైసా ఖాతాదారులకు తిరిగివ్వాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి నిర్దుష్టమైన హామీ ఇవ్వడంతో పాటు, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. అసలు ఇంతపెద్దమొత్తంలో మోసం జరిగే వరకు బ్యాంకు ఉన్నతాధికారుల పసిగట్టకుండా ఉండడం విచారకరం అన్నారు.