– ముగ్గురు మహిళల కిరాతకం!
– మరో ముగ్గురిపై హత్యాయత్నం
– నగలు, డబ్బు కోసం దారుణాలు
– తెనాలిలో సంచలనం
తెనాలి, మహానాడు: స్థానిక యడ్ల లింగయ్య కాలనీలో ఈ ఏడాది జూన్ నెలలో రజిని అనే మహిళ ఆటోను బాడిగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాలని డ్రైవర్కు చెప్పింది. ఆటోలో రజినితోపాటు నాగూర్ బీ అనే మహిళ కూడా ఎక్కింది. వీరితోపాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్పై వచ్చింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ చేత రజిని బ్రీజర్ కొనిపించింది. రజిని, నాగూర్ బీ, వెంకటేశ్వరి వడ్లమూడి సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నాగూర్ బీ కి ఇవ్వాలనుకున్న బ్రీజర్లో రజిని, వెంకటేశ్వరి సైనేడ్ కలిపి ఇచ్చారు. బ్రీజర్ తాగిన వెంటనే నాగూర్ బీ చనిపోయింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలును తీసుకుని ఇద్దరూ మహిళలు అక్కడ నుండి వెళ్ళిపోయారు.
నాగూర్ బీ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ను విచారించగా రజిని అనే మహిళ ఆటోలో వచ్చినట్టు డ్రైవర్ చెప్పాడు. యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజినిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారు ఆభరణాలు కోసం నాగూర్ బీ కి సైనేడ్ కలిపిన బ్రీజర్ తాగించినట్టు ఆ ఇద్దరూ మహిళలు చెప్పారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా మరో ముగ్గురు మహిళలకు సైనేడ్ ఇచ్చి చంపినట్టు విచారణలో తేలింది.
– 2022 లో మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బుల, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మి స్వయాన అత్త.
– 2023లో నాగమ్మ అనే మహిళను థమ్స్అప్లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న 20,000 రూపాయల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు.
– తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే అనే వ్యక్తి తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు అతని భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే ఫెన్షన్, ఇన్సూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదర్చుకున్నారు.
ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. వారికి ఆహారం, కూల్ డ్రింగ్, టీ లలో సైనేడ్ కలిపి ఇవ్వగా చివరి సమయంలో ప్లాన్స్ వర్కవుట్ అవ్వలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్ కలిపి హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ హత్యలన్నింటింకి ముగ్గురు మహిళలే కారణమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వీరికి సైనేడ్ విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రజలను హెచ్చరించారు.