మాటలు కోటలు దాటతాయి.. చేతలు తంగెళ్లు దాటవు

-తెలంగాణ కాంగ్రెస్ తీరు 
-బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
-మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు 

హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతాయి.. చేతలు తంగెళ్లు దాటవు అని మెదక్ పార్లమెంటు సభ్యులు ఎం. రఘునందన్ రావు అన్నారు. శంషాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రఘునందన్ రావు  మాట్లాడుతూ…

దేశంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ కి విజయాన్ని అందించిన తెలంగాణ సమాజానికి సెల్యూట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

7 నెలల కాంగ్రెస్ పాలనలో గులాబీ రంగు మూడు వర్ణాలైంది తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. బీఆర్ఎస్ పాలనలో మూడు రంగుల జెండా మీద గెలిచిన వాళ్లు గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గులాబీ కండువాపై గెలిచినవాళ్లు మూడు రంగుల కండువా కప్పుకుంటున్నరు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.

డిసెంబరు 9న సోనియా గాంధీ బర్త్ డే కానుకగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సీజన్‌కు రూ. 7,500, ఏడాదికి రూ. 15 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పి అధికారంలో వచ్చి 7 నెలలు దాటినా అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.

నాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ నిష్పత్తి 1:100 ప్రకారం ఇవ్వాలని భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తోంది. నిరుద్యోగులకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మర్చిపోయారు. కాని రేవంత్ రెడ్డి మాత్రం నెలనెలా రూ.4 లక్షల జీతం తీసుకుంటున్నరు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆశలను, ఆకాంక్షలను కాలరాస్తున్నారు.

గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంపు,.. గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు పెంచుతూ, డీఎస్సీ పరీక్షలు 30 రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని నేడు బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు.

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలుండగా కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణ జరిపించాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు, గొర్రెల పంపిణీ లో జరిగిన అక్రమాలపై అసలు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ టాక్స్, యూకే టాక్స్, బీవీ టాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించనందున ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ రోగులకు ట్రీట్మెంట్ అందడం లేదు. ప్రజాభవన్ లో ప్రజాసమస్యల పరిష్కారం కోసం సమయం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమయం దొరకడం లేదు కాని, పదేపదే ఢిల్లీ పర్యటనలకు మాత్రం సమయం దొరుకుతోందని విమర్శించారు.

గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల కాలపరిమితి ముగిసినా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా స్పెషల్‌ ఆఫీసర్లతో కాలం వెల్లదీస్తోంది. గ్రామపంచాయతీల్లో పాలన పడకేసి, ప్రజలు విషజ్వరాలతో అవస్థలు పడుతున్నారు. ప్రజాపాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేలా పోరాటం చేస్తూ, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు రఘునందన్ రావు తెలిపారు.