రైతన్నల ఆత్మగోస ఎవరికీ పట్టడంలే!

ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

హైదరాబాద్, మహానాడు :  రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం… అయినా రైతన్నల ఆత్మగోస ఎవరికీ పట్టడంలేదని ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇంత జరుగుతున్నా ఏలుబడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదన్నారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.