ఐదుగురు సీఐలపై ఈసీ బదిలీ వేటు

తిరుపతి: చాలాకాలంగా తిరుపతి, తిరుమలలో పనిచేస్తున్న ఐదుగురు సీఐలపై బదిలీ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో పనిచేస్తున్న సీఐ జగన్మోహన్‌రెడ్డి చాలా కాలంగా పోలీసు అధికారులు, వైసీపీకి మధ్యవర్తిగా పనిచేస్తూ చక్రం తిప్పారు. ఆయనతో పాటు గతంలో శ్రీకాళహస్తిలో వివాదాస్పదంగా వ్యవహరించి ప్రస్తుతం తిరుప తిలో పనిచేస్తున్న సీఐ అంజూయాదవ్‌, మంత్రి పెద్దిరెడ్డి మనిషిగా చలామణి అయిన సీఐ అమర్నాథ్‌రెడ్డి, తిరుపతి సైబర్‌ క్రైమ్‌ సీఐ వినోద్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సీఐ శ్రీని వాసులును బదిలీ చేస్తూ గత అర్ధరాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తక్షణం అనంతపురం డీఐజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని సూచించింది. వారంతా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఈ చర్యలు చేపట్టింది.