వ్యవసాయంపై ఒక్క మంత్రికీ అవగాహన లేదు

మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌: వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారన్నారు.

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. నీళ్లు ఎలా లిఫ్ట్‌ చేయాలో తెలిసే కేసీఆర్‌ కన్నెపల్లి వద్ద పంప్‌ హౌస్‌ నిర్మించారన్నారు. మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం చెబుతున్నది. ఇప్పుడు మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని చెప్పారు.

మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని చెప్పారు. కోదాడ, సూర్యపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఎన్‌డీఎస్‌ఏ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాకులు చెబుతున్నదని విమర్శించారు.

ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఎన్‌డీఎస్‌ఏ హైదరాబాద్‌ రాకుండా ఢిల్లీ నుంచే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పినట్లు రిపోర్ట్‌ ఇచ్చిందని విమర్శించారు.