• వైసీపీ నేతల దౌర్జన్యంపై ఫిర్యాదు
• గతంలో వైసీపీతో అంటకాగి మళ్లీ వీసీ పదవి కోసం ఆ ప్రొఫెసర్ పాకులాట
• పాత బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి
• క్లైమ్స్ కోసం ఇంజక్షన్ తో జనాల ప్రాణాలు తీస్తున్న హంతక ముఠా
మంగళగిరి, మహానాడు: అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ.. ఆర్ఐఓ పదవి నుండి తొలగింపునకు గురై గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో కడప జిల్లా వృత్తి విద్యా అధికారిగా నియమితుడై నేడు ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న ఎస్. రవి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. అక్రమ ట్రాన్స్ఫర్ లతో మళ్లీ అవినీతి సంపాదనకు శ్రీకారం చుట్టారని.. అతని అవినీతికి అడ్డూ అదుపు లేదని.. తులసి వనంలో గంజాయి మొక్కలా ఉన్న అతనిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ విద్యార్థి సంఘ నాయకులు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలోని నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగూరు నారాయణ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిలు అర్జీలు స్వీకరించి విచారించి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
• ఎవరికి అనుమానం రాకుండా డెలివరీ బాయ్ లా వచ్చి.. ఒక్క ఇంజక్షన్ పొడిచి గుండెపోటు వచ్చేలా చేసి మనిషిని చంపేసి అతనికి రావాల్సిన క్లైమ్స్ ను కొట్టేస్తున్నారని.. విభేదాలు ఉన్న, కోర్టు కేసులు ఉన్న కుటుంబాలే వారి టార్గేట్ అని.. మందుల షాపులు పెట్టుకుని, నకిలీ డాక్టర్స్ ఒక ముఠాగా తయారై జనాల ప్రాణాలు తోడేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ నుండి వచ్చిన పలువురు మంత్రి పొంగూరు నారాయణకు వినతి ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
• తమ వ్యవసాయ భూమిని గోరా శ్రీను( బెజవాడ శ్రీను) దౌర్జన్యంగా దున్నతున్నాడని.. అతని దౌర్జన్యాలను అరికట్టి తమకు న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాజుపాలెం గ్రామానికి చెందిన ఆంజనేయ సాగర ప్రసాద్ గ్రీవెన్స్ లో అర్జీని ఇచ్చి అభ్యర్థించాడు.
• తమ భూమిని ఆక్రమించి వైసీపీ నేతలు అక్రమ వెంచర్లు వేస్తున్నారని.. దాన్ని అడ్డుకోవడానికి వెళితే దుర్భాషలాడుతున్నారని.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మోటుపల్లి గ్రామానికి చెందిన బసవమ్మ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. అధికారులు విచారించి అక్రమార్కులు వేస్తున్న వెంచర్ ను తొలగించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• కరోనా సమయంలో వందల మంది కరోనా పేషెంట్స్ కోసం సరఫరా చేసిన టెంట్స్, బెడ్ షీట్ లు, బట్టలు, షాంపులు, వాటర్ టిన్నులు ఇతరత్రా దాదాపు రూ. 50 లక్షలకు పైగా ప్రభుత్వం ఆదేశాల మేరకు అప్పుగా తెచ్చి ఖర్చుపెట్టగా ఇప్పటికీ డబ్బులు తమకు అందలేదని.. దయచేసి తమకు బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని భీమవరానికి చెందిన గంటా వెంకట సురేష్ నేతలను కోరారు.
• అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ కొక్కిరాపల్లికి చెందిన గొర్లె కొండలరావు విజ్ఞప్తి చేస్తూ.. తాము మున్సిపాటీలో అభివృద్ధి పనుల్లో భాగంగా 2018 లో చేపట్టిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదని.. తాము టీడీపీకి చెందిన వారమని బిల్లులు రాకుండా అడ్డుకున్నారని.. రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
• శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం రూరల్ డవలప్ మెంట్ లో పనిచేస్తోన్న ఓ ప్రొఫెసర్ గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగి.. మళ్లీ నేడు పదవి కోసం పాకులాడుతున్నారని.. వీసీ పదవికోసం అప్లై చేసుకున్నారని.. అతనికి ఆ పదవి ఇవ్వకుండా చూడాలని పలువురు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• తన భూమిని తనకు తెలియకుండానే బి. పవన్ కుమార్, బి. మధులు కలిసి మరొక వ్యక్తికి అమ్మారని.. దీనిపై తహశీల్దార్ కు కూడా ఫిర్యాదు చేశామని.. అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని.. దీనిపై విచారించి న్యాయం చేయాలని వి. వరదమ్మ అనే మహిళ గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు.
• సెగ్గెం నాగేశ్వరరావు, సెగ్గెం పద్మలు తమది కాని భూమిని అమ్ముకుని భూమికి అసలు వారసుడిని అయిన చల్లా వెంకటేశ్వర్లు అను తనని ఇబ్బంది పెడుతున్నారని.. దీనిపై విచారించి న్యాయం చేయకుండా పోలీసులతో బెదిరిస్తున్నారని.. గ్రీవెన్స్ లో తెలియజేయగా.. పోలీసు అధికారులతో మాట్లాడి.. విచారించి బాధితుడికి న్యాయం చేయాలని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
• మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను డిఎస్సీ ద్వారా నియమిస్తూ.. బదిలీలు చేయకపోవడంతో ఎంతో మంది భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని.. దయ చేసి మున్సిపల్ ఉపాధ్యాయులకు జిల్లా బదిలీలు, సాధారణ బదిలీలు జరిపించాలని వారు వేడుకున్నారు.