జగన్‌ ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధం

-పదేళ్ల ఎమ్మెల్యే..ఒక్క వీధిలో అయినా తిరిగారా?
-గుంటూరు నీటి కష్టాలు తీర్చలేకపోయారు
-తూర్పు నియోజకవర్గ పర్యటనలో పెమ్మసాని

గుంటూరు, మహానాడు: గంజాయి సరఫరా చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్‌ ప్రభుత్వపు అవినీతిపై చర్చకు తాను సిద్ధమని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్‌ తెలిపా రు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. కార్యక్రమంలో భాగంగా 50, 51, 52, 53, 54, 55, 56 డివిజన్లలో నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌తో కలిసి పర్యటించారు. వస్త్ర, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులను, ప్రజలను కలుసుకుంటూ ప్రచారం కొనసాగించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే టీడీపీ స్వీప్‌ చేస్తుందని స్పష్టమవుతుంది. రాజధానిని బాగు చేయమని కోరితే జగన్‌ గంజాయిని పెంచి పోషించారు.

2019కి ముందు జగన్‌ బ్రాండ్ల నాసిరకం మద్యం ఎక్కడైనా కనిపించిందా? రాజధాని ఎక్స్‌ప్రెస్‌, బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ గోల్డ్‌, పవర్‌ స్టార్‌ అంటూ ఎప్పుడూ వినని పేర్లతో మద్యం బ్రాండ్లు ప్రజలపైకి వదిలారు. ఎమ్మెల్యే బంధువులు బందిపోట్లు మాదిరిగా నియోజకవర్గాన్ని దోచుకున్నారు. జగన్‌ ప్రభుత్వపు అవినీతిపై నేను చర్చకు సిద్ధం, రావడానికి మీరు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. పదేళ్లుగా ఎప్పుడైనా ఈ వీధుల్లో, సందుల్లో ఎమ్మెల్యే తిరిగారా? కృష్ణానది పక్కనే ఉన్నా, నీటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నా గుంటూరుకు ఎందుకు నీరు అందించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. నా శక్తి మేరకు ప్రజలకు మేలు చేస్తానే తప్ప ఎవరి కష్టాన్ని దోచుకోవాల్సిన పని లేదన్నారు.

నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకపోగా పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మార్చిన నాయకుడు ఈ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ పర్యటనలో నియోజ కవర్గ జనసేన సమన్వయకర్త నేరెళ్ల సురేష్‌కుమార్‌, నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర వర్మ, 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ ముప్పవరపు భారతి, ముస్లిం నాయకుడు సయ్యద్‌ ముజీబ్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.