ఎర్రచందనం వీరప్పన్ల సంగతి తేలుస్తాం

-నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు
-సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎర్రచందనం స్మగ్లర్లు 
-ఎర్రచందనం సహా శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక 
-నివేదిక ఆధారంగా దోచుకున్న వారిపై చర్యలు
-రాజకీయ ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదు
-కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి, మహానాడు: తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేశారన్నారు. గత పాలనలో వీరప్పన్ వారసులు శేషాచల కొండల్లోని జాతీయ సంపదైన ఎర్రచందనం స్మగ్లింగ్ తో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నివేదిక తెప్పించుకుంటామన్నారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదన్నారు.

తన పుట్టిన రోజును పురస్కరించుకుని బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు… ముఖ్యాంశాలు…

కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, వైకుంఠాధీశుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు ప్రజలంతా చల్లగా ఉండాలని, రెండు రాష్ట్రాలు బాగుండాలని, దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చల్లని చూపు చూడాలని, భారత్ ను విశ్వగురు స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న నరేంద్రమోదీకి ఆశీస్సులు అందించాలని  స్వామివారిని మొక్కుకున్నా.

ప్రస్తుతం తిరుమలలో భక్తి యుత, ధార్మిక వాతావరణం నెలకొంది. కానీ మొన్నటి వరకు దేవుడిని నమ్మని వాళ్లు, ధర్మం గురించి ఆలోచించని వాళ్లు పేరుకు నామాలు పెట్టుకుని స్వామివారి ఆస్తులకే పంగనామాలు పెట్టారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మొన్నటి వరకు మారింది. పదవుల కోసం టీటీడీని వాడుకున్నారు. ఆ నయవంచకుల పాలన పోయింది. నిత్యం వెంకటేశ్వర నామస్మరణ చేసే సేవకుల రాజ్యం వచ్చింది.

మేం ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమలను అపవిత్రం చేయడానికి, సొంత ఆష్తులను పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు. అందుకే రెండు కొండల వాడా గోవిందా..గోవిందా అనే పాలన పోయింది. అరాచక పాలన పీడ విరిగింది. ఏడుకొండల వాడా గోవిందా…గొవిందా.. అని సేవ చేసే రాజ్యం వచ్చింది.

నేను నిన్న ఇక్కడికి వచ్చిన. నా దగ్గరకు ప్రజలు వచ్చి గత పాలకులు చేసిన అక్రమాలు, నిర్వాకాలు చెబుతున్నారు. లంగ దందాలు, లఫంగ దందాలు చేశారని, శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు. శ్రీవారి సంపద, జాతీయ సంపదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటూ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నేతలను వాళ్ల గుప్పిట్లో పెట్టుకున్నారు. పార్టీలు నడవాలన్నా… ఎన్నికల్లో గెలవాలన్నా తమ చలువ ఉండాలనే స్థాయికి దిగజారారు. చివరకు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి వచ్చారు.

ఈ విషయాన్ని వదిలిపేట్టే ప్రసక్తే లేదు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తాం. జాతీయ సంపద దోచుకున్న అంశంపై నివేదిక తెప్పించుకుంటాం. రాజకీయ ఒత్తిళ్లకు భయపడబోం. శ్రీవారి సంపదను కాపాడే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.