ఏపీ జేఏసి అమరావతి స్టేట్ చైర్మన్
అమరావతి, మహానాడు : మహిళా ఉద్యోగినులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర చైర్ పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయ లక్ష్మిలు కోరారు. బుదవారం వెలగపూడి సచివాలయంలో ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ (హెచ్.ఆర్) అల్లాడి గౌతంని కలిసి విన్నవించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
ప్రభుత్వ ఉద్యోగుల్లో అధికశాతం మహిళా ఉద్యోగులే పనిచేస్తున్నారు. గత ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం చైల్డ్ కేర్ లీవును మహిళా ఉద్యోగినులు ఆరు మాసాల పాటు పది స్పెల్స్ లో వారి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు నిండే లోపు పిల్లల అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చని ఆదేశాలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవును వారి పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే లోపే వాడుకోవాలన్న నిబంధనల వలన మెజారిటీ మహిళా ఉద్యోగులు ఈ ప్రయోజనం పొందలేక పోతున్నారు.
ఆ నిబంధనల్లో మార్పులు చేసి 18 సంవత్సరాలు సీలింగ్ ఎత్తివేసి, మహిళా ఉద్యోగినులు పదవీ విరమణ చేసే లోపు వారి పిల్లల అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వమని ఉద్యోగ సంఘాలు కోరాయి. ప్రభుత్వం మార్చి 2024న సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు ఇస్తూ, తదుపరి గైడ్లైన్స్ ఆర్థిక శాఖ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. మధ్య కాలంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ 36 చైల్డ్ కేర్ లీవ్ కు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.