Mahanaadu-Logo-PNG-Large

పునర్విభజన పెండింగ్ అంశాలపై రేవంత్‌ దృష్టి

-అస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం
-18న కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించాలని నిర్ణయం

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్‌ 2వ తేదీ నాటికి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్‌ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయో జనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

హైదరాబాద్‌ ఇక తెలంగాణకే…
పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌ వంటి భవనాలను జూన్‌ 2 తర్వాత రాష్ట్ర అధీ నంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు.

18న కేబినెట్‌ సమావేశం
ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినేట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్‌ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.