రూ. 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు!

– దసరా పండుగకు ముందు రోజు పనులకు భూమి పూజ
– 20 నుంచి 25 ఎకరాల్లో భవన సముదాయం
– ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
– ఓ కుటుంబంలా చదువుకునేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మాణాలు
– పేదలు వారి బిడ్డలను ఇక్కడ చేర్పించి ప్రచారం చేయాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, మహానాడు: ఈ ఏడాది ఐదువేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని, దసరా పండుగకు ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో మీడియాతో ఏమన్నారంటే… యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైనది.

తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావలసిన నిధులు కేటాయించి విద్యపై దృష్టి పెడతామని చెప్పాం… ఆ మేరకు పనులు ప్రారంభిస్తున్నాం. 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 12th క్లాస్ వరకు విద్యాబుద్ధులు ఇక్కడ నేర్పిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ కళాశాలలు పక్కాభవనాలు లేక కల్యాణ మండపాలు, అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

బలహీన వర్గాలకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలని ఇందిరమ్మ ప్రభుత్వ నిర్ణయించింది. 20 నుంచి 25 ఎకరాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం.. ఇప్పటివరకు 25 నియోజకవర్గాల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఇతర వివరాలు పంపారు. వాటిని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. మిగిలిన నియోజకవర్గాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా నిర్మాణాలు ప్రారంభిస్తాం.

ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి మూడు నెలలుగా కసరత్తు చేసి ఓ రూపానికి తెచ్చింది యావత్ మంత్రి మండలి. చీఫ్ సెక్రటరీ మొదలు వివిధ శాఖల ఉన్న అధికారులకు అభినందనలు. రాష్ట్రంలో ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉండగా ఇందులో 662 పాఠశాలలో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలపై ఐదు వేల కోట్లు ఖర్చు చేయబోతుంది. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలకు ఒక ఏడాదిలో కేటాయించిన మొత్తం 73 కోట్లు మాత్రమే.

కొన్నేళ్ళుగా ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఉష్ణోగ్రతలు, గాలి వాటం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆధునిక రెసిడెన్షియల్ భవనాలు నిర్మిస్తాం. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు అన్ని వర్గాల వారు కలిసి ఒక చోట ఓ కుటుంబంలా చదువుకునే లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భవనాల నిర్మిస్తాం. కేవలం చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణ కాకుండా క్రీడలు, వినోదం వంటివి విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఏ కొరత లేకుండా చూసే కార్యక్రమంలో భాగంగా థియేటర్ నిర్మించి శాటిలైట్ ద్వారా పిక్చర్స్ సైతం ప్రదర్శించే ఆలోచనలో ఉన్నామన్నారు. పేద వర్గాల వారు వారి బిడ్డలను ఈ పాఠశాలల్లో చేర్పించి విరివిగా ప్రచారం నిర్వహించాలని కోరారు.