సజ్జల, ఆయన తనయుడు భార్గవ్‌ పరార్‌

ఫోన్ల స్విచ్చాఫ్‌తో హైకమాండ్‌ ఆరా
వారి వల్లే ఓడామని జగన్‌ ముందు అభ్యర్థుల గగ్గోలు
సోషల్‌ మీడియాలో బిల్లులు ఆగిపోయాయని ఆవేదన
వెతికే పనిలో ఉన్న పార్టీ శ్రేణులు

అమరావతి: జగన్‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ముఖ్యమంత్రి కన్నా తానే ఎక్కువ అని ఫీల్‌ అయి నిర్ణయాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అతని తనయుడు సజ్జల భార్గవ్‌ ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నాయి. గత గురువారం జగన్‌మోహన్‌రెడ్డి జరిపిన సమావేశానికి వారు గైర్హాజరయ్యారు. ఫోన్లు స్విచాఫ్‌ వస్తుండడంతో పార్టీ హై కమాండ్‌ ఆరా తీసింది. రామకృష్ణారెడ్డి వల్లే ఓడిపోయామని సమావేశంలో జగన్‌ ముందు ఓడిన అభ్యర్థులు గగ్గోలు పెట్టారు. తమను ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని, గంటలు..గంటలు ఆఫీసుల్లో కూర్చోబెట్టి పంపించేవారని ..సజ్జల వల్లే తాము ఈ స్థితిలో ఉన్నామని జగన్‌ ముందు చెప్పి వాపోయారు. ఆయన చేసిన నిర్వాకం వల్ల సోషల్‌ మీడియాలో చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయల్లో ఆగిపోయాయి. కొన్ని ఆర్థికపరమైన విషయాలు కూడా సజ్జలతో ముడిపడి ఉండటంతో అతనిని వెతికే పనిలో ఉన్నారు.