సిద్దిపేట జిల్లాను రద్దు కానివ్వం

రైతుబంధు ఆపడం…ఇదేనా మార్పు?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు

సిద్దిపేట: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని, జిల్లాలను రద్దు చేస్తామం టున్నారని, ప్రాణం పోయినా సిద్దిపేట జిల్లాను రద్దు చేయించనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణం శివానుభవ మండపంలో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అనంతరం ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో మార్పు వస్తుందని చెబుతున్నారని, రైతుబంధు ఇవ్వకపోవడం ఇదేనా మార్పు అని ప్రశ్నించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.150 కోట్ల పనులు ఆపారని, వెటర్నరీ కళాశాల తరలించారని తెలిపారు. బీజేపీ అభ్యర్థి దుబ్బాకలో ఏమీ చేయలేదన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు ఫారుక్‌ హుస్సేన్‌, రవీందర్‌ రెడ్డి, మల్లికార్జున్‌ రెడ్డి, రాజలింగం, దరిపల్లి శ్రీను, రమేష్‌, ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ముదిగొండ శ్రీనివాస్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.