ఎర్రచందనం స్మగ్లర్ల నిరోధానికి కఠిన చర్యలు

– టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు

తిరుపతి: శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన గురువారం కపిలతీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్సు కార్యాలయాన్ని సందర్శించారు.

టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అధికారులతో సమావైశమైన ఎస్పీ టాస్క్ ఫోర్సు పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆపరేషనల్ టీమ్ లతో అభిప్రాయ సేకరణ చేసి, ఆపరేషన్ విధానాలను తెలుసుకున్నారు. సమాచారం పొందే విధానం నుంచి స్మగ్లర్లను పట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఆపరేషనల్ టీమ్స్ వివరించారు. స్మగ్లర్లను నిరోధించడానికి మరిన్ని వ్యూహాలను చేపట్టాల్సి ఉందని సూచించారు.

ఇప్పటి వరకు టీమ్స్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, మరింత ముందుకు వెళ్లడానికి తీసుకోవాల్సిన విధానాల గురించి సూచనలు చేశారు. ప్రతి అధికారి చేపడుతున్న విధులను తెలుసుకుని, వారికి సూచనలు అందజేశారు. ముఖ్యంగా అడవుల్లోకి వెళ్ళినపుడు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికంగా చేపడుతున్న సమాచార వ్యవస్థ గురించి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఆయనకు కడప, రైల్వే కోడూరు, సానిపాయ సబ్ కంట్రోల్ ల నుంచి జరుగుతున్న ఆపరేషన్ విధానాలను టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ వివరించారు. బేస్ క్యాంపులు, ఎంట్రీ ఎగ్జిట్ పాయంట్ల గురించి తెలియజేశారు. తరువాత టాస్క్ ఫోర్సు ఆవరణలోని కంట్రోల్ రూమ్, పోలీసు స్టేషన్, అక్కౌంట్స్ ఆఫీసు, రవాణా ఆఫీసు తదితర ప్రాంతాలను సందర్శించారు. అవసరమైతే తిరుపతి జిల్లా పోలీసు విభాగం సహకారం కూడా తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు, ఆర్ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డి, ఎసీఎఫ్ శ్రీనివాస్, సీఐలు శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.