– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కలకలంగా మారిన ఎరువులు, పురుగుమందుల నకిలీ, కల్తీ, బ్లాక్మార్కెట్ మాఫియా తాటతీయాలని అధికారులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. రైతులకు నష్టం జరిగే ఏ పనినీ ఈ ప్రభుత్వం సహించదు, చర్యలు చాలా కఠినంగా ఉంటాయనే సందేశం అందరికీ చేరాలన్నారు. అందుకోసం అవసరమైతే లైసెన్స్ల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనకాడొద్దని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టర్ అరుణ్బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడారు.
ఇప్పటి నుంచి వ్యవసాయ సీజన్ ముగిసే వరకు జిల్లావ్యాప్తంగా ఎరువులు అధిక ధరలకు అమ్మేవారు, పురుగుమందులు నకిలీ, కల్తీ చేసే వారు భయపడేలా కొరడా ఝళిపించాలన్నారు. ఎరువులకు సంబంధించి నిల్వలపై తనిఖీలు చేసి మార్కెట్లో కొరత లేకుండా చూడాలన్నారు. ఎరువుల అక్రమ నిల్వలు, నకిలీ ఎరువులు, అనుమతి లేని బయో ఉత్పత్తుల ఉనికి ఎక్కడ కనిపించినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు సమయానుగుణంగా అవసరమైన రసాయనిక ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారు ఇప్పటి వరకు వాడిన, వాడుతున్న మందులపై వివరాలు తీసుకోవాలని, పురుగుమందుల దుకాణాల్లో రిజిస్టర్లు తనిఖీ చేయాలన్నారు. ఏమాత్రం తేడా కనిపించినా ఆ దుకాణాలను బ్లాక్లిస్ట్లో పెట్టాలన్నారు.
రైతులు నష్టపోయినచోట్ల నకిలీ ఎరువులు, బయో ఉత్పత్తులు అమ్మిన వ్యాపారులపై కేసులు పెట్టి పరిహారం ఇప్పించాలని సూచించారు. పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు ప్రైవేటు ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు.