Mahanaadu-Logo-PNG-Large

హైకోర్టులో పిన్నెలికి తాత్కాలిక ఊరట

మధ్యంత బెయిల్‌ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు
ఇరుపక్షాల న్యాయవాదుల అనుమతితో కోర్టు నిర్ణయం

అమరావతి: ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించిన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్‌ పిటిషన్లపై వెకేషన్‌ బెంచ్‌ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే రాత్రి 10 దాటడం, పూర్థిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరు పక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలు కొట్టిన వ్యవహారంతో పాటు మరో రెండు హత్యా యత్నం కేసులు పిన్నెల్లిపై నమోదైన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిన్నెల్లి తరపున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌ రెడ్డి ప్రాథమిక వాదనలు వినిపించారు. టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు తరపున సీనియర్‌ న్యాయ వాది పోసాని వెంకటేశ్వర్లు, సీఐ నారాయణ స్వామి తరపు న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపించారు.