– చిన్నారి హత్య కేసులో దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు
-ఇప్పటికే బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
– బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడి భరోసానిచ్చిన సీఎం చంద్రబాబు
– గత ఐదేళ్ల పాలనలో ఏనాడైనా హత్య, అత్యాచారాలపై జగన్ నోరు మెదిపారా?
– పసిపాప దూరమై నిశ్చేష్టులైన తల్లిదండ్రులని మరింతగా క్షోభ పెట్టకండి
– 100 రోజుల పాలనలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు ‘నార్కోటిక్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు
– సహచర మంత్రులు ఫరూక్, రాం ప్రసాద్ లతో పుంగనూరు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రెస్ మీట్ లో హోం మంత్రి అనిత
అమరావతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో తొలుత అదృశ్యమై అనంతరం హత్యకు గురైన చిన్నారి కేసులో దోషుల్ని వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. బాలిక హత్య కేసులో ఐదుగురు అనుమానితులను గుర్తించడమే కాకుండా ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.
పుంగనూరులో బాలిక కుటుంబాన్ని హోం మంత్రి అనిత సహచర మంత్రులైన రాం ప్రసాద్, ఫరూక్ లతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. చిన్నారి ఆచూకి కోసం పోలీసులు నిర్విరామంగా శ్రమించిన తీరును హోం మంత్రి అనిత ప్రశంసించారు. అయినా బాలిక ప్రాణాలతో తిరిగిరాకపోవడం తనను కలచివేసిందన్నారు. అనంతరం మృతురాలి తండ్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడి నిందితులను పట్టుకుని శిక్షిస్తామని ఓదార్చారు.
చావులను రాజకీయాల కోసం వాడుకునే వైసీపీ: అనిత
బాధ, భావోద్వేగాలను పట్టించుకోకుండా చావులను రాజకీయాల కోసం వాడుకునే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హోం మంత్రి అనిత విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో అత్యాచార, హత్యలపై వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ఏనాడైనా స్పందించారా అంటూ ఆమె ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన ఘోరమైన నేరాలు చూస్తూ కూడా ఏ ఒక్క రోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వందల సంఘటనలు జరిగినా నిందితులపై చర్యలు తీసుకున్న సందర్బాలు శూన్యమంటూ మండిపడ్డారు. పుంగనూరులో చిన్నారి అదృశ్యమైందన్న సమాచారం రాగానే బాలిక ఆచూకి కోసం 12 తనిఖీ బృందాలు, క్లూస్ టీంలు, డాగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామని హోం మంత్రి పేర్కొన్నారు. పోలీసులు శక్తివంచన లేకుండా శ్రమించినా చిన్నారి శవమై దొరకడం అత్యంత బాధాకరమన్నారు. బాలిక మృతి చెందిన గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను పట్టుకోవడం కూటమి ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
జగన్ రాజకీయం చేస్తే ఊరుకోం
వైఎస్సార్సీపీ నేతలు అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదంటూ హితవు పలికారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వెళితే తమకు ఏ ఇబ్బంది లేదు..రాజకీయం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. తమ కూతుర్ని హతమార్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి కోరారని.. ఈ విషయంలో దోషులెవరినీ వదలమని కచ్చితంగా కఠినంగా శిక్షపడేలా చూస్తామని తెలిపారు.
ప్రచారం జరుగుతున్నట్లుగా చిన్నారిపై అత్యాచారం జరగలేదని హోం మంత్రి స్పష్టం చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనా కొంత మంది కావాలనే విష ప్రచారం చేసి తల్లిదండ్రులను మరింత క్షోభ పెడుతున్నారన్నారు.
100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు.