-సోషల్మీడియా వార్తలు ఊహాజనితమే
-పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఖండన
అమరావతి: తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం జరుగుతోందని, లబ్థిదారులు వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కార్యద ర్శి ఖండించారు. అసలు తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రకటన పూర్తి పాఠం ఇదీ..
కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధార్ చట్టం 2016, రెగ్యులేషన్ 15, సెక్షన్ 7, మరియు దాని సవరణలు, అనుబంధ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వశాఖలు ఏవైనా పథకాల యొక్క లబ్ధిదారులను గుర్తించుటకు ఆధార్ ఉపయోగించదలచినచో గెజిట్ పబ్లికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న UIDAI నుండి కావలసిన అనుమతులు పొందవలసి ఉన్నది.
దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 43/2023 చట్టము కూడా తీసుకురావడము జరిగినది. అలాగునే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ITE&C డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు తేదీ 21.05.2021 ద్వారా ఇదే విషయము తెలియజేస్తూ ప్రభుత్వ శాఖల వారు గెజిట్ పబ్లిష్ చేయ వలసినదిగా తెలియజేశారు. లేనియెడల, ఆధార్ సేవలలో అంతరాయం కలుగునని కూడా తెలియజేశారు. దీనికనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖలు ఆధార్ వినియోగించుటకు ఇటువంటి గెజిట్ పబ్లికేషన్లు ఇదివరకే ఇవ్వడం జరిగినది.
ఈ సందర్భంలోనే కమిషనర్, పాఠశాల విద్యాశాఖ వారి ప్రతిపాదనలతో, పాఠశాల విద్యాశాఖ GO Ms 29 తేదీ 09.07.2024 కూడా ఆధార్ వినియోగించుటకు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగినది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధార్ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న చర్య మాత్రమే.” తల్లికి వందనం” పథకం సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇంకనూ ఖరారు చేయవలసి ఉన్నది. పైన తెలిపిన జీవోలో “తల్లికి వందనం” పథకమునకు సంబంధించి ఇప్పటివరకూ, ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వబడలేదు. ఇది ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే అని తెలియజేయడమైనది.
కానీ, కొన్ని వార్తా పత్రికలలో మరియు సామాజిక మాధ్యమాలలో ఈ జీవో ని చూపిస్తూ “తల్లికి వందనం” పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది. కాబట్టి అటువంటి వార్తలు అవాస్తవమని తెలియజేస్తూ, వాటిని నమ్మవద్దు అని తెలియజేయడమైనది.
“తల్లికి వందనం” పథకం మార్గదర్శకాలు మరియు విధివిధానాలు ప్రభుత్వం రూపొందిoచిన తరువాత తెలియజేయబడును. అప్పటివరకు ఎటువంటి అవాస్తవ కథనాలను నమ్మొద్దని కోరడమైనది.