ప్రజలు ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలి

గాలివాటంగా వచ్చిన గెలుపు కాదు
ఈ విజయం కార్యకర్తలకు అంకితం
కూటమి ఘనవిజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్
టెలీకాన్ఫరెన్స్ పాల్లొన్న ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు

టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే… కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల కష్టం, కృషి ఎంతో ఉంది. 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి మనం గెలిచాం. ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నా. కూటమి విజయం సాధారణమైంది కాదు…గాలివాటంగా వచ్చిన గెలుపు కాదు. ప్రజలు నమ్మకంతో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు.

కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్ తో… 57 శాతం ఓట్ షేర్ ను సాధించింది. 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయం వెనక నేతలు, కార్యకర్తలు నిలబడిన తీరు, ఐదేళ్లు పడ్డ కష్టం ఉంది. గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీలు వచ్చాయి. పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ రూరల్, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకు పైన మెజారిటీ వచ్చింది. కార్యకర్తలు, నేతలు పోటీ పడి పని చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. విశాఖ, శ్రీకాకుళం, అమలాపురం, గుంటూరు ఎంపీ స్థానాల్లో 3 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది.

గత ఐదేళ్లు మీరు పడ్డ కష్టాలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. ఎన్నికల్లో కార్యకర్తల పాత్ర మర్చిపోలేనిది. పసుపు జెండా పట్టుకుంటే చెయ్యి విరగొట్టారు…జై తెలుగుదేశం అంటే గొంతు కోశారు..అయినా కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసి పార్టీ కోసం పని చేశారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు…కొందరు ఆస్తులు కోల్పోయారు… ఇంకొందరు జైలు పాలయ్యారు.

కార్యకర్తల కష్టాలు, వారిపై వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపాను. మీ త్యాగం నా జీవితంలో మర్చిపోలేను. కింద స్థాయి నుంచి ఎవరు…ఎక్కడ ఏం పని చేశారో అధ్యయనం చేస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయి. ఎలా చేయాలి…వారికి ఏం చేయాలి అనే విషయంలో ఆలోచనలు చేస్తున్నాం.

అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవీగడం చేయవద్దు. ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలను విస్మరించ కూడదు. ప్రజలు తప్పుపట్టేలా ఎటువంటి పనులు చేయొద్దు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని మనం కాపాడుకోవాలి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇంత పొలిటికల్ వేవ్ లేదు. కూటమి విజయానికి సహకరించిన ప్రజలను మనం ఆదుకోవాలి.

ఎన్నికల ముందు సూపర్-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రకటించాం..ఇచ్చిన హామీలను తప్పుకుండా అమలు చేస్తాం. ఇటీవల మెగాడీఎస్సీ ఫైలుపై సంతకం చేసి 16,347 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్ రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం, స్కిల్ గణనపై నాలుగో సంతకం, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై ఐదో సంతకం చేశాం. యువతలో నైపుణ్యం ఏ మేరకు ఉందో గణన చేసి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. నైపుణ్య గణనతో జీవన ప్రమాణాలను మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది.

2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో…. వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా పథకాలు అమలు చేస్తాం. 2047 నాటికి మన దేశం ఉన్నత స్థాయిలో ఉండాలి…అందులో తెలుగువారు నెంబర్ -1 గా ఉండాలి అనేది నా ఆకాంక్ష. దాని కోసం కష్టపడతాను. పార్టీ కార్యకర్తలకు గౌరవం, ప్రాధాన్యత ఉండేలా నేతలు నడుచుకోవాలి. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేస్తాం.

నేను తరుచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతాను. జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళతాను. నేతలు కూడా జిల్లాల్లో పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటా. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తాం. కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి ఇబ్బందులు పరిష్కరిస్తేనే వారిలో మనోబలం పెరుగుతుంది.

గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించాం…ఇక ముందు కూడా ఆదుకుంటాం. ఇప్పటికే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టాం. పాజిటివ్ గవర్నెన్స్ ను తీసుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. అందరం కలిసి పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని బీజేపీ కూడా ముందుకు వచ్చింది. మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు.

నాయకుడు ఎలా ఉండకూడదో…ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో జగన్ ఒక కేస్ స్టడీ. పాలన ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా, ఆదర్శంగా పాలన సాగిద్దాం. 2029 ఎన్నికలకు ఇప్పటి నుండే కృషి చేయాలి. ప్రజలతో మమేకమైతే ఇదే ఫలితాలు 2029లో వస్తాయి. అహంకారానికి దూరంగా, బాధ్యతగా, చిత్తశుద్దితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు.

ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపై ప్రజల్లో చర్చ విస్తృతంగా జరగాలి. పార్టీలోని ప్రతి కమిటీ ఉత్సాహంగా పని చేయాలి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తాం. ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోను. ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటా.