-రాచరిక ఆనవాళ్లు ఉంటే వీటిని కూడా మార్చండి
-అమరుల కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోండి
-బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ లోగోను మారిస్తే కొన్ని పట్టణాల పేర్లు కూడా మార్చాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణాలు, జిల్లాలో పేర్లలో కూడా రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని వాటిని కూడా మార్చాలని కోరారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1.ఆదిలాబాద్(ఎదులాపురం)గా 2. నిజామాబాద్ (ఇందూరు)గా 3.జహీరాబాద్ (పెద్దెక్కిలి)గా 4..కరీంనగర్ (ఎలగందల)గా 5.సికింద్రాబాద్ (లష్కర్ లేదా ఉల్వులు)గా 6. మహబూబ్ నగర్ (పాలమూరు)గా 7. మహబూబాబాద్ (మానుకోట)గా పేర్లు ఇంకా స్థానికులు వాడుతున్నారు. వాటిని కాంగ్రెస్ సర్కారు అధికారికంగా పునరుద్ధరించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేయాలని సూచించారు. నిరంకుశ పాలన సాగించిన ముస్లిం పాలకుల గుర్తులను, ఆనవాళ్లను తెలంగాణ నుంచి లేకుండా చేయాలనేది తమ డిమాండ్ అని తెలిపారు. ముస్లిం పాలకుల గుర్తయిన చార్మినార్ను తొలగించే దమ్ము, ధైర్యముందా అని ప్రశ్నించారు. నిజంగా రాచరికపు గుర్తులను తొలగించాలనే చిత్తశుద్ధి నిజంగానే ఉంటే… తెలంగాణ నుంచి దురాక్రమణదారులైన ముస్లిం పాలకుల ఆనవాళ్లు లేకుండా చేయాలి, ప్రజల ఆదరణ పొందిన కాకతీ యుల వంటి హిందూ పాలకుల గుర్తులను తొలగించడం సరికాదని తెలిపారు. ఇక ప్రభుత్వం రూపొందించిన కొత్త లోగోలో అమరవీరుల స్థూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన మహేశ్వర్ రెడ్డి…ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అమరుల కుటుంబాలను పట్టించుకోండి
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు, వారి తల్లి లేదా తండ్రి లేదా భార్యకు ప్రతినెలా రూ. 25 వేలు అమరవీరుల గౌరవ పెన్షన్, ఇళ్ల స్థలాలు అందజేస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వానికి…. తెలంగాణ ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన బీజేపీ నేతలను విస్మరించడం సరికాదన్నా రు. ఉద్యమ సమయంలో తెలంగాణకు సోనియా గాంధీ బలి దేవతగా మారారని ఆరోపించిన ఆనాటి టీడీపీ నేత, నేటి ముఖ్యమంత్రి ఇప్పుడు బలి దేవతకు భక్తుడిగా మారాడని ఎద్దేవా చేశారు.