రామోజీ సంస్మరణ సభలో లోపాలు ఉండవద్దు

రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయండి
సమాచారశాఖ మంత్రి పార్దసారథి ఆదేశం

మచిలీపట్నం: పద్మ విభూషణ్ గ్రహీత, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈనెల 27వ తేదీన రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నేపథ్యంలో సోమవారం సాయంత్రం పెనమలూరు మండలం తాడిగడప- ఎనికేపాడు నూరడుగుల రహదారి మార్గంలో శ్రీ చైతన్య కళాశాల ఎదురుగా చేపట్టిన సంస్మరణ సభ ఏర్పాట్లను మంత్రివర్యులు పరిశీలించారు.

ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయుచున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మంత్రివర్యులు అధికారులకు సూచించారు. సభా ప్రాంగణంలో పందిరి, ప్రధాన వేదిక, గ్యాలరీలు, బారికేడింగులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలన్నారు. సభకు విచ్చేయు ముఖ్య అతిథులకు, ప్రజలకు, జర్నలిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు పార్కింగ్ ప్రదేశాలు, రహదారి మార్గంలో ఎలాంటి చెత్తాచెదారాలు లేకుండా పారిశుధ్యం నిర్వహించాలన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఉయ్యూరు ఆర్డిఓ డి రాజు, తాడిగడప మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డ్రైనేజీ ఈ ఈ విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.