ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ

– అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం
-ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టాం.అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తాం.ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వము.
కాంగ్రెస్ నాయకులారా.. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి. తల ఎత్తుకొని … ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండి. మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, లక్ష రూపాయల రుణమాఫీని 25000 చొప్పున.. నాలుగు దఫాలుగా పూర్తి చేశారు.

ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన మనం రెండు లక్షల రుణమాఫీనీ నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నాం.ఆర్థిక ఇబ్బందులు ఉన్న.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాము. అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు.

పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారు. సీఎం సవాల్ ఓట్ల కోసమే.. ఎన్నికల సవాల్ అనుకున్నారు.. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ, రూపాయి రూపాయి పోగుచేసి రుణమాఫీని అమలు చేయబోతున్నాము.

కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం రుణమాఫీ. చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామని ప్రతి గ్రామానికి కాంగ్రెస్ నాయకులు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది.. అని వివరించి రైతులు ప్రజల హృదయాలు గెలవాలి.