ఢిల్లీలో గళం వినిపించాం

విజయవాడ, మహానాడు :  ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం చేరుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ మార్గాని భారత్ మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేసామన్నారు. అఖిలేష్ యాదవ్ తోపాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. త్వరలో ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామన్నారు.

మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు.