కార్మిక రంగాన్ని సంక్షేమం వైపుకు నడిపిస్తాం

– మత్స్యకారుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎమ్మెల్యే గద్దె పంపిణీ

విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం కార్మిక రంగాన్ని పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని కార్మిక రంగాన్ని సంక్షేమం వైపునకు నడిపిస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక గరికపాటి వారి వీధిలో నివాసి మత్స్యకారుడు మైలా వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన ఐదు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వెంకటేశ్వరరావు మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ పేదలకు ఎంతో ఉపయోగంగా ఉండే చంద్రన్న బీమా పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారన్నారు. వెంకటేశ్వరరావు గత ఏడాది చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు మరణించారని చెప్పారు. గత ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అదుకోలేదని చెప్పారు. అందువల్ల ఈ సంఘటన జరిగి ఏడాదికి పైగా అయినా మానవతా దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.5 లక్షలను అందచేశారని చెప్పారు.

చంద్రన్న బీమా పథకం ద్వారా ఏవరైనా కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు మరణించిన వ్యక్తి పెద్దకర్మ జరిగేలోపునే అందచేశారని, మరణించిన వెంటనే రూ.10 వేలు అందచేసేవారని చెప్పారు. కార్మికులకు ఎంతో ఉపయోగంగా ఉండే బీమా పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎవ్వరూ ప్రవేశపెట్టినా అది మంచి పథకమని చంద్రబాబునాయుడు భావించి అమలు చేశారని చెప్పారు.

పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని మరింతగా చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఇప్పుడు ఆసుపత్రులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కొంచెం కొంచెంగా విడుదల చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి క్రాంతి శ్రీ, చెన్నుపాటి గాంధీ, యలమంచిలి దేవేంద్ర, సర్రా కిషోర్, అన్నాబత్తుల బాబి, చిలకలపూడి నరసింహారావు, అన్నాబత్తుల శ్రీదేవి, పలమనేని సుబ్బారావులతో పాటు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.