‘జగన్ వైరస్’ తో యువత భవిత నాశనం!

– మాజీ మంత్రి పీతల సుజాత మండిపాటు

మంగళగిరి, మహానాడు: జగన్ వైరస్ తో ఆంధ్రప్రదేశ్ యువత భవిత నాశనం అయిందని, ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులకు కారణం జగన్ రెడ్డి గంజాయి, డ్రగ్సే అని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. జగన్ రెడ్డి హయాంలో పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యం వల్ల మృగాళ్ళుగా మారిన మగాళ్లు మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఆ పాపం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఆ పాపం రాష్రాన్ని ఇంకా వెంటాడుతూ ఆడబిడ్డల పాలిట శాపమైంది. జగన్ రెడ్డి హయాంలో వేలాది అత్యాచారాలు, హత్యలు జరిగితే ఒక్కరోజూ ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు? జగన్ రెడ్డి ఇంటి సమీపంలో ఎస్సీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకటరెడ్డిని ఐదేళ్ల పాటు అరెస్ట్ చేయకుండా చోద్యం చూసి ఇప్పుడు మహిళల రక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.

సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ అత్యాచారానికి గురయితే పట్టించుకోకపోగా ప్రశ్నించిన టీడీపీ దళిత నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని అన్నారు. రాజమండ్రిలో 16 ఏళ్ల బాలికపై ఏడుగురు యువకులు 4 రోజుల పాటు అత్యాచారం, విశాఖలో ఎస్సీ బాలికపై 10 మంది మృగాళ్లు అత్యాచారం, నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై మృగాళ్ల దాడి వంటి ఘటనలు, మైనారిటీ విద్యార్థిని మిస్బాని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేయడం మహిళా భద్రత విషయంలో నిర్లక్ష్యం, మహిళా రక్షణ పట్ల జగన్ రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేశాయన్నారు. తెనాలిలో దాడికి గురయిన మహిళ కేసులో నిందితుడు నవీన్ అతని కుటుంబం మొదటినుంచి వైసీపీ పార్టీకి చెందినవారమని స్వయంగా నవీన్ తల్లి చెబుతుండగా జగన్మోహన్‌ రెడ్డి అండ్‌ కో నిందితుడు టీడీపీ నాయకుడంటూ అబద్దపు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు.

కాకినాడలో దుర్గాప్రసాద్ , నెల్లూరులో హరిప్రసాద్ హత్యకు గురైతే ఆ దళిత కుటుంబాలను జగన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు? అక్కడ నేరస్తులు వైసీపీ వారు కావడమేనా కారణం అని అన్నారు. లేని దిశా చట్టం పేరుతో హడావుడి చేసిన జగన్ రెడ్డి ఆ చట్టంతో ఎంత మంది నేరస్తులను శిక్షించారో సమాధానం చెప్పాలి. తల్లికి, చెల్లికి న్యాయం చేయని జగన్ మహిళలకు ఏం న్యాయం చేస్తారు? పిన్నమ్మ తాళి తెంచిన నేరస్తుల్ని కాపాడుతున్న సైకో జగన్, దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి చిన్న వయస్సులో ఉన్న ఆయన భార్య తాళి తెంచిన నేరస్తుని కాపాడుతున్న సైకో జగన్ మహిళలకు ఏం న్యాయం చేస్తారు? సొంత చెల్లిపై, తల్లిపై కేసులు వేసి వాళ్ళను ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలోని మహిళలపై చెల్లెమ్మలంటూ కపట ప్రేమ చూపిస్తున్నాడన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అత్యాచార ఘటనలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలోనే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలిస్తున్నారన్నారు. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని, కచ్చితంగా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.