Mahanaadu-Logo-PNG-Large

ముస్లింలు లేకపోతే అభివృద్ధి లేదు

-సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు పార్లమెంట్ లో భేషరతుగా వైసీపీ మద్ధతు తెలిపింది
-హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లిం సోదరుడికి రూ. లక్ష సాయం అందిస్తాం
-నెల్లూరు రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేసింది టిడిపినే
-టిడిపి ముస్లింల కోసం హజ్ హౌస్ లు కడితే జగన్ రెడ్డి తన కోసం ప్యాలెస్ లు కట్టుకున్నారు
-కూటమి సూపర్ సిక్స్ ముందు జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్
-నెల్లూరులో ముస్లిం సోదరులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ముస్లిం సోదర సోదరీమణులందరికి అస్సాలామాలేకుం…
ముస్లింలంటే గుర్తుకు వచ్చేది నమ్మకం, ధైర్యం. కష్టాన్ని నమ్ముకొని జీవించే మనస్థత్వం కలవారు. అన్ని రంగాల్లో ముస్లింల ప్రాధాన్యత ఉంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో జీవనం సాగించాలని ముస్లింలు కోరుకుంటారు. ముస్లింలు లేకపోతే అభివృద్ధి లేదు. ప్రతి పట్టణంలో ఆటోనగర్ లో ముస్లింలే ఎక్కువ రిపేర్లు చేస్తారు.

భవన నిర్మాణం రంగంలోను ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. నా 14 ఏళ్ల పాలన, జగన్ ఐదేళ్ల పాలన ప్రజలందరూ చూశారు. ఎవరి పాలనలో ముస్లింలకు ఎక్కువ న్యాయం జరిగింది? పరిపాలన ప్రజారంజకంగా ఉండాలి. ప్రజల కోసం పరిపాలించాలి. స్వార్ధం కోసం పాలన చేస్తే ఎక్కువ రోజులు ఆ మోసాలు ఆగవు.

2014లో విభజన జరిగింది, ఆదాయం లేదు, 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధితో ముందుకు నడిపించాను. హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఉందంటే అందకు కారణం టిడిపినే. హైదరాబాద్ లో ముస్లిం సోదరులు నేడు దేశంలోనే అందరి కంటే బాగున్నారంటే అందుకు కారణం టిడిపినే. ఎప్పుడు ఎన్డీఏ లో ఉన్నా ఏ ఒక్క ముస్లింకి అన్యాయం చేయలేదు. ఎన్టీఆర్ వచ్చాకే ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ తెచ్చారు. పీఎం వాజ్ పాయ్ సహకారంతో హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటిని ఏర్పాటు చేశాం. అదే విధంగా హజ్ హౌస్ లు కట్టాం. విభజన తరవాత కడప, విజయవాడలోను హజ్ హౌస్ లు కట్టించాం.

ప్రస్తుతం మనం సమావేశం ఏర్పాటు చేసుకున్న షాదీ మందిర్ ని రూ.8 కోట్లతో మూడంతస్థుల్లో భవనం కట్టించాం. ఈ చుట్టు పక్కల ప్రాంతంలో 20వేల మంది ముస్లింలతో పాటు నెల్లూరు పట్టణంలో ఉన్న ముస్లింల పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ మందిర్ ఎంతో ఉపయోగకరం. ఐదేళ్ల పాలనలో ముస్లింల కోసం జగన్ రెడ్డి ఒక్కటైనా ఇలాంటి భవనం కట్టించాడా? దుల్హన్ పథకం అమలు చేశాం. ఉర్దూని రెండో భాషగా ఏర్పటు చేశాం. రంజాన్ తోఫా, విదేశీ విద్యను తీసుకువచ్చాం. పేద ముస్లింలను పైకి తెచ్చేందుకు అనుక్షణం కృషి చేశాను. రూ.10 ఇచ్చి రూ.100 దోచేశారు.

నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను, పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచేశారు. ముస్లింలలో మద్యం తాగే వారు చాలా తక్కువ కాబట్టి నాశిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చలగాటాలాడుతున్నారు. రాష్ట్రాన్న దోపిడీకి గురి చేశారు. ఇసుక దొరకని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక్క సైకోనే బాగుండాలి, ఇంకెవ్వరూ బాగుండటానికి ఆయన ఒప్పుకోరు.

విదేశీ విద్య విధానంతో 527 మంది విద్యార్ధులకు రూ.15 లక్షల ఆర్ధిక సాయం అందించాం. ప్రతి ఏడాది 10వేల మంది రూ.3 లక్షల రుణం ఇప్పించాం. దర్గాలు, మసీదులు, ఈద్గాల మరమ్మత్తులకు నిధులు ఇచ్చాం. ఇమాం, మౌజన్ లకు గౌరవ వేతనం ఇచ్చాం. కాని జగన్ రెడ్డి ఇవేవి చేయలేదు. ఇమాం మౌజన్ లకు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తే గాని ఇచ్చాడు. ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని అన్నాడు పెట్టాడా? నెల్లూరులో రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేశాం. అబ్దుల్ కలాం ఆజాద్ స్కిల్ డవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాం. గోషా హాస్పిటల్ మహిళల కోసం నిర్మించాం.

రాష్ట్రంలో ఆడబిడ్డలపై దాడులు పెరిగాయి. ముస్లింలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. 50 మందిపైన దాడు చేశారు. నంద్యాల అబ్దుల్ సలాంని దొంగగా ముద్రించి వేదించడంతో ఆత్మహత్య చేసుకోవాలని చూస్తే మీ కుటుంబ సభ్యులను సైతం వేధిస్తామని పోలీసులు హెచ్చరించడంతో నలుగురు రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేస్తే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే చేశారు. అది జగన్ కి చంద్రబాబుకి ఉన్న తేడా. అబ్దుల్ కలాంనే రాష్ట్రపతిగా నియమించాలని టిడిపి వాజ్ పేయ్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడంతో ఆయనను రాష్ట్రపతిగా చేశారు.

పలమనేరులో మిస్బా అనే విద్యార్ధిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. ఒక మైనారిటి బిడ్డకు చదువుకోవడానికి హక్కు లేదా? నర్సరావుపేటలో వక్ఫ్ భోర్డును వైసీపీ నాయకులు ఆక్రమిస్తే అడ్డుకున్నందుకు చంపేశారు. మాచర్లలో 100 మంది ముస్లిం కుటుంబాలను బహిష్కరించారు. నందికొట్కూరులో మహిళ నమాజ్ కి వెళ్లి వస్తుంటే ఆమె బుర్కా తీసి అవమానించడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హీనంగా కొట్టిన పార్టీ వైసీపీ. గతంలో టిడిపి హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా?

సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు పార్లమెంట్ లో కేంద్రానికి సపోర్ట్ చేశారు. ఏ2 విజయసాయిరెడ్డి బిల్లుకు మద్ధతుగా సంతకం కూడా పెట్టారు. ఇప్పుడు ముస్లింలకు టిడిపి అన్యాయం చేస్తుందంటూ నాటకాలాడుతున్నారు. మభ్యపెట్టి మోసాలు చేసి ముస్లింలను అమాయకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మసీదులు కట్టిస్తే జగన్ ఒక్క మసీదు కట్టలేదు. ముస్లింలకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు.

ముస్లింలకు 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. మంచి లాయర్లను పెట్టి వాదనలు వినిపించాలి. నాడు మేయర్ గా ఉన్న అజీజ్ తో మాట్లాడి 4% రిజర్వేషన్ కోసం పెద్ద పెద్ద లాయర్లను ఏర్పటు చేసి వాదనలు వినిపించిన పార్టీ టిడిపి. వైసీపీ ఎంపీలకు ఓట్లు వేస్తే అవి బీజేపీకి పోతాయి. అదే నాకు వేస్తే ప్రజల కోసం పని చేస్తాం. జగన్ కేసుల కోసం మా ముస్లిం సోదరులు ఓటు వేయాలా?

ఐదేళ్ల్లల్లో దుర్మార్గమైన పాలన చేశారు. దాడులు ఎందుకు చేశారని ప్రశ్నిస్తే నామీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో నా కుటుంబ సభ్యులను అవమానించినందుకు గౌరవ సభలో మళ్లీ సీఎం అయ్యాకే అడుగు పెడతానని శపథం చేశాను. ఈ రాష్ట్ర ప్రజల కోసం శపథం చేశాను. కూటమి సూపర్ సిక్స్ అయితే జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం ఒక్కో విద్యార్ధికి రూ.15వేలు చొప్పున ఎంత మంది విద్యార్ధులుంటే అందరికి ఇస్తాం. ఇంట్లో ఎంత మంది విద్యార్ధులుంటే ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తానని చొప్పున అందరికి ఇస్తానని హామీనిచ్చి కేవలం ఒక్కరికి మాత్రమే ఇస్తున్నారు.

దాదాపు 20 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ అంటే అదేమైనా కూడు పెడుతుందా అని అన్నారు. నేడు అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. సుపరిపాలనతో పెరిగిన నిత్యావసర ధరలను తగ్గిస్తాం. ఏడాదికి 3 సిలెండర్లు ఇస్తాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం. మీ జీవితాల్లో వెలుగును నింపేందుకు మంచి డ్రైవింగ్ తీసుకువస్తాను. పరిపాలన తెలిసిన డ్రైవర్ ను. అది కూడా చాలా సేఫ్ గా ఉంటుంది. నేను సంపద సృష్టించి ఆదాయం పెంచితే జగన్ ఉత్తుత్తి బటన్ లు నొక్కుతున్నాడు.

ఐదేళ్లుగా ఆదాయం పోయింది. పోలవరం, అమరావతిని విధ్వంసం చేశారు. పరిశ్రమలు పారిపోయాయి, పిల్లలకు ఉద్యోగాలు లేవు. యువత కోసం ప్రపంచం మొత్తం తిరిగి పరిశ్రమలు తెస్తే జగన్ వాటన్నింటిని తరిమేశారు. నాయకుడంటే సంపద సృష్టించే వాడు. ఐదేళ్లు నాటకాలాడి మొత్తం నాశనం చేశారు.

కూటమి ప్రజల కోసం కలిసింది. మాస్వార్ధం కోసం కలవలేదు. కేంద్రం నుంచి నిధులు, పనులు కావాలంటే మూడు పార్టీలు కలిసి ఉండాలి. ఈ పొత్తు వలన ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాది. తెలుగు గడ్డపై ఉండే ప్రతి ఒక్క కుటుంబం నా సొంత కుటుంబం. ఎవ్వరికి ఏ అనుమానం అవసరం లేదు. నా జీవితం ఈ పేదవాళ్లకు అంకితం. పేదవాళ్ల కోసం సంపాదించి పెంచిన ఆదాయాన్ని పంచుతాను. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల చేతుల్లో చిప్ప పెడతాడు. చేప ఇవ్వడంతో పాటు చేపలు పట్టడం కూడా నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి.

హజ్ యాత్రకు హైదారబాద్ నుంచి నేరుగా విమానాలు వేయించింది టిడిపినే. హజ్ యాత్రకు వెళ్లే ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ముస్లిం హజ్ యాత్రకు వెళ్లొచ్చు. ముస్లింల మనోభావాలను గౌరవించే పార్టీ టిడిపి. మీ జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నాను. దేశ సంపదను పేద వాళ్లకు పంచాలి. ఆడబిడ్డల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా దుల్హన్ పథకంతో పెళ్లి పీటలు దగ్గర ఉన్నప్పుడే డబ్బులిచ్చాను. కాని జగన్ ఇటువంటి సాయం ఎప్పుడూ చేయలేదు. స్వర్ణకారులకు గతంలో రూ.10 కోట్లు మంజూరు చేశాం.

కానీ జగన్ వాటిని రద్దు చేశారు. మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే వాటితో పాటు అనేకమైనవి అమలు చేస్తాం. ఆడబిడ్డలను చదివించాలనుకున్న పార్టీ టిడిపి. దేశంలో కులాలు, మతాల వారిగా సెన్సస్ తీస్తున్నారు. నైపుణ్యాలు సెన్సస్ కూడా తియ్యాలి. ఆడబిడ్డలను చదివించడమే గాక అవసరమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తాను. అబ్దుల్ కలాం చాలా సాధారణ కుటుంబం ఒక సైంటిస్ట్ అయ్యాడు. అవసరమైతే మైనారిటి సోదర, సోదరీమణులకు ఎన్ని కాలేజీలైనా పెట్టి చదువుకోవడానికి ప్రోత్సాహకాలు అందిస్తాను.

వాలంటీర్లకు రూ.5వేలు ఇచ్చి జగన్ మోసం చేశారు. కాని నేను రూ.10 ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా వాళ్లల్లో స్కిల్స్ పెంచి రూ. లక్ష సంపాదించేలా కృషి చేస్తాను. కలలకు రెక్కలు అనే కార్యక్రమంతో విద్యార్ధులకు ఏ యూనివర్సిటీ అయినా ఏ దేశం వెళ్లినా వడ్డీ లేని రుణం ఇప్పించే బాధ్యత నాది. ముస్లింల కోసం గురుకు ల పాఠశాల 90 శాతం పూర్తి చేశాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేస్తాం.